అమ్మకాలు తగ్గినా ఉద్యోగులకు వేతనాలు పెంచిన వాహన కంపెనీలు

ABN , First Publish Date - 2020-12-02T03:35:54+05:30 IST

వాహన విక్రయాలు గణనీయంగా తగ్గినప్పటికీ దిగ్గజ కంపెనీలైన మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), హ్యాందయ్

అమ్మకాలు తగ్గినా ఉద్యోగులకు వేతనాలు పెంచిన వాహన కంపెనీలు

న్యూఢిల్లీ: వాహన విక్రయాలు గణనీయంగా తగ్గినప్పటికీ దిగ్గజ కంపెనీలైన మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), హ్యాందయ్ మోటార్, హీరో మోటోకార్ప్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటివి తమ ఉద్యోగులకు వేతనాలు భారీగా పెంచాయి. కరోనా తర్వాత ఈ ఫెస్టివ్ సీజన్‌లో అమ్మకాలు పెరగడంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. భారత్‌లోని అతిపెద్ద ట్రాక్టర్, ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ అయిన ఎం అండ్ ఎం ఈ నెల నుంచే ఉద్యోగులకు వేతనాలు పెంచాయి. నిజానికి ఈ సంస్థ ప్రతి ఏడాది ఆగస్టు 1న ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ప్రకటిస్తుంది. అయితే, ఈసారి కరోనా మహమ్మారి వేతన పెంపును అడ్డుకుంది.


మార్కెట్ లీడర్ మారుతి సుజుకి, దేశంలోని రెండో అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల తయారీ సంస్థ హ్యుందయ్, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఎంజీ మోటార్స్, కియాలు కూడా తమ ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అక్టోబరు నుంచే అన్ని విభాగాల్లోనూ ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్టు మారుతి సుజుకి ఇండియా సినియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (హెచ్‌ఆర్, ఐటీ) ఆర్ ఉప్పల్ తెలిపారు. 


అయితే, దేశీయ ట్రక్ మేకర్లు అయిన టాటా మోటార్స్, అశోక్ లేలాండ్‌లు మాత్రం ఈ ఏడాది ఇంక్రిమెంట్లు ఇవ్వకూడదని నిర్ణయించాయి. ఇంక్రిమెంట్ల గురించి ఈ ఏడాది ఆలోచించకూడదని నిర్ణయించినట్టు అశోక్ లేలాండ్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) బాలచందర్ పేర్కొన్నారు. తమకు కూడా పెంచే ఉద్దేశం ఏదీ లేదని టాటామోటార్స్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-02T03:35:54+05:30 IST