హిజాబ్ వివాదంపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదు : విదేశాలకు భారత్ స్పష్టీకరణ

ABN , First Publish Date - 2022-02-12T17:38:09+05:30 IST

తరగతి గదుల్లో హిజాబ్ ధారణపై న్యాయ విచారణ జరుగుతున్న

హిజాబ్ వివాదంపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదు : విదేశాలకు భారత్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ : తరగతి గదుల్లో హిజాబ్ ధారణపై న్యాయ విచారణ జరుగుతున్న సమయంలో ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని అమెరికా, తదితర దేశాలకు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. మీడియా ప్రశ్నలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందిస్తూ, ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోందని, పరిపాలన, ప్రజాస్వామిక అంశాలకు సంబంధించిన సమస్యలను భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి పరిశీలించి, పరిష్కరిస్తుందన్నారు. భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. 


ఎంఈఏ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశ అంతర్గత వ్యవహారాలపై ప్రేరేపిత వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో డ్రెస్ కోడ్‌కు సంబంధించిన వివాదం న్యాయ పరిశీలనలో ఉందని, ఆ రాష్ట్ర హైకోర్టు విచారణ జరుపుతోందని తెలిపింది. భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం ద్వారా ఈ సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంది. భారత దేశ రాజ్యాంగ నిబంధనావళి, యంత్రాంగం, అదేవిధంగా ప్రజాస్వామిక లక్షణాలు, వాతావరణం, రాజ్య పరిపాలనలకు అనుగుణంగా వీటికి పరిష్కారం దొరుకుతుందని తెలిపింది. భారత దేశం గురించి తెలిసినవారు ఈ వాస్తవాలను సరైన విధంగా అర్థం చేసుకోగలరని తెలిపింది.  


అమెరికా ఏమన్నదంటే...

అంతర్జాతీయ మత స్వేచ్ఛకు సంబంధించిన అమెరికా రాయబారి రషద్ హుస్సేన్ ఇచ్చిన ట్వీట్‌లో, మతపరమైన దుస్తులను ఎంపిక చేసుకునే సామర్థ్యం కూడా మత స్వేచ్ఛలో భాగమేనని తెలిపారు. పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధించడం మత స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని, మహిళలు, బాలికలను అణగదొక్కడమేనని ఆరోపించారు. హుస్సేన్ ఓ ఇండియన్-అమెరికన్. 


పాకిస్థాన్ విమర్శ

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ స్పందిస్తూ, ముస్లిం బాలికలకు విద్యను నిరాకరించడం ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. 


ఈ నేపథ్యంలో ఎంఈఏ ఈ వివరణ ఇచ్చింది. కర్ణాటక హైకోర్టు గురువారం ఇచ్చిన తాత్కాలిక ఆదేశాల్లో పాఠశాలల్లోని తరగతి గదుల్లో మతపరమైన వస్త్రాలను ధరించవద్దని తెలిపింది. హిజాబ్, కాషాయ కండువాలు, జెండాలు వంటివాటిని తరగతి గదుల్లో ధరించరాదని చెప్పింది. విద్యా సంస్థలను తిరిగి తెరవాలని, విద్యార్థులను తరగతులకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతుంది.


ఉడిపిలో ప్రారంభం

తరగతి గదుల్లో ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించడంపై నిషేధం విధిస్తూ కర్ణాటకలోని ఉడిపి జిల్లా, కుందపూర్ ప్రీ యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ రుద్ర గౌడ గత ఏడాది డిసెంబరులో ఆదేశాలు జారీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థుల మధ్య సమానత్వం కోసం ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆరుగురు విద్యార్థినులు హిజాబ్ ధరించి తరగతులకు హాజరయ్యేందుకు ప్రయత్నించగా, వారిని పాఠశాల యాజమాన్యం వారించింది. ఈ వివాదం పెద్దది కావడంతో ఇతర వర్గాల విద్యార్థులు కాషాయ కండువాలతో తరగతులకు హాజరయ్యేందుకు ప్రయత్నించారు. ముస్లిం విద్యార్థినులకు మద్దతుగా కొందరు నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతో సమానత్వాన్ని దెబ్బతీసే, సమగ్రతకు విఘాతం కలిగించే, ప్రజా శాంతిని భంగపరిచే వస్త్రాలను ధరించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 


Updated Date - 2022-02-12T17:38:09+05:30 IST