కన్నబిడ్డను అమ్మేసింది.. మద్యం కోసం ఓ తల్లి కాఠిన్యం
ABN , First Publish Date - 2020-08-12T15:24:56+05:30 IST
మద్యానికి బానిసైన ఆమె మాతృత్వానికి మచ్చగా మిగిలింది. మద్యం కోసం కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టింది. రెండు నెలల పసికందును రూ. 45 వేలకు అమ్మేసింది. హబీబ్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏఎస్ మగ్రాలో నివాసం ఉండే అబ్దుల్ జోయా ఖాన్,
రూ. 45 వేలకు రెండు నెలల పసికందు అమ్మకం
మంగళ్హాట్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : మద్యానికి బానిసైన ఆమె మాతృత్వానికి మచ్చగా మిగిలింది. మద్యం కోసం కన్నబిడ్డనే అమ్మకానికి పెట్టింది. రెండు నెలల పసికందును రూ. 45 వేలకు అమ్మేసింది. హబీబ్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏఎస్ మగ్రాలో నివాసం ఉండే అబ్దుల్ జోయా ఖాన్, అబ్దుల్ ముజాహిద్లకు ఇది వరకే వేర్వేరుగా పెళ్లిళ్లు అయ్యాయి. అబ్దుల్ జోయా ఖాన్ భర్తతో విడిపోగా, ముజాహిద్ కూడా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల క్రితం వీరికి ఒక బాబు అద్నాన్ పుట్టాడు. అబ్దుల్ ముజాహిద్ ఎర్రమంజిల్లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. రెండు నెలల క్రితం వీరు హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబాన్పురాకు మకాం మార్చారు. ఈ నెల 3న జోయా ఖాన్, ముజాహిద్లు గొడవ పడ్డారు. దీంతో ముజాహిద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. జోయాఖాన్కు మద్యం అలవాటుంది.
మద్యానికి బానిసైన ఆమె డబ్బు కోసం తన బాబును అమ్మే ప్రయత్నాల్లో ఉంది. పాతబస్తీ కాలాపత్తర్లో నివాసం ఉండే ఫరాజ్ కూతురికి ఇటీవలే బాబు పుట్టి చనిపోయాడు. దీంతో ఆమె మతిస్థిమితం తప్పింది. ఓ పసికందును ఆమె వద్దకు చేర్చితే యథాస్థితికి వస్తుందని ఫరాజ్ భావించింది. బిడ్డ కోసం ఆగాపురాలో నివాసం ఉండే తన బంధువైన షేక్ ముజాహిద్ను ఆశ్రయించింది. షేక్ ముజాహిద్, అతడి భార్య తబసుమ్ బేగం జోయాఖాన్ను కలిశారు. రూ. 45 వేలకు బాబును కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా ఈ నెల 8వ తేదీన తిరిగి ఇంటికి వచ్చిన జోయా ఖాన్ భర్త అబ్దుల్ ముజాహిద్కు కుమారుడు కనిపించలేదు. బాబు ఎక్కడున్నాడని భార్యను ప్రశ్నించగా అమ్మేసినట్లు చెప్పింది. ఫరాజ్ కుటుంబీకుల వద్ద బాబు ఉన్నాడన్న విషయం తెలుసుకుని వారిని సంప్రదించాడు. తన బాబును ఇచ్చేయాలని కోరాడు. వారు అంగీకరించలేదు. దీంతో మంగళవారం హబీబ్నగర్ పోలీసులను ఆశ్రయించాడు. ఎస్ఐ జయంత్తో పాటు సిబ్బంది కాలాపత్తర్కు చేరుకొని బాబును అతడి తండ్రి ముజాహిద్ వద్దకు చేర్చారు. జోయాఖాన్ తో పాటు కొనుగోలు చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.