ఇళ్ల స్థలాలకు ‘తాకట్టు భూమి’

ABN , First Publish Date - 2020-07-11T08:35:27+05:30 IST

బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల కోసం సేకరించడమే కాకుండా, నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఘటన గుంటూరులో వెలుగు

ఇళ్ల స్థలాలకు ‘తాకట్టు భూమి’

  • బ్యాంకు అప్పు తీర్చకుండానే ప్రభుత్వానికి ఇచ్చేసిన రైతులు
  • నకిలీ దస్తావేజులు సృష్టించి నేతలు, అధికారుల కుమ్మక్కు
  • తనఖా భూమికి కోట్లలో చెల్లింపులు
  • బ్యాంకు ఫిర్యాదుతో రంగంలోకి సీబీఐ 
  • ఇంచార్జ్‌ తహసీల్దార్‌ తొలగింపు

గుంటూరు, జూలై 10(ఆంధ్రజ్యోతి): బ్యాంకు తాకట్టులో ఉన్న భూమిని పేదలకు ఇళ్ల కోసం సేకరించడమే కాకుండా, నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకును మోసం చేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఇద్దరు రైతులతో అధికార పార్టీ నేతలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయి.. కోట్లు పోగేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట, ముత్తాయపాలెం గ్రామాల్లో రైతులు మోదేపల్లి అచ్యుత రామారావు, శ్రీనివాసరావుకు సుమారు 8-9 ఎకరాల భూమి ఉంది. దీనిని వారు గుంటూరులోని లక్ష్మీపురం సెంట్రల్‌ బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రూ1.2 కోట్లు రుణం పొందారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలూ బ్యాంకులోనే ఉన్నాయి. ఇంతలో ‘పేదలకు ఇళ్లు’ పథకం కింద స్థానికంగా అధికారులు భూసేకరణ చేపట్టారు. ఈ క్రమంలో ఈరైతులతో కొందరు అధికార పార్టీ నేతలు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై నకిలీ పత్రాలు సృష్టించి సేకరణ కింద ఈ భూమిని ఇచ్చేశారు.


వాస్తవానికి ఎకరా రూ.15 లక్షల కంటే ఎక్కువ పలకని ఈ భూములను ఎకరం రూ.55-60 లక్షల చొప్పున ప్రభుత్వానికి విక్రయించారు. అయితే రైతులకు ఇచ్చింది.. ఎకరాకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు మాత్రమే.  ఈ వ్యవహారం బ్యాంకు అధికారుల దృష్టికి రాగా, బ్యాంకు మేనేజరు అరుణ రైతులు, సర్వే రాళ్లు వేసిన అధికారులపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. దీంతో మేనేజరు నేరుగా సీబీఐ, ఆర్‌బీఐని ఆశ్రయించారు.  సీబీఐ రంగంలోకి దిగడంతో రెవెన్యూ అధికారులు హడావుడిగా ఇంచార్జి తహసీల్దార్‌ను విధుల నుంచి తొలగించారు. అమరావతి పోలీసులు కూడా ఇద్దరు రైతులపై కేసులు నమోదు చేశారు. 

Updated Date - 2020-07-11T08:35:27+05:30 IST