Har Ghar Tiranga: ఇంత సూపర్‌ హిట్టా?

ABN , First Publish Date - 2022-08-17T00:26:36+05:30 IST

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహాత్సవ్‌లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ త్రివర్ణ పతాకాన్ని ఇంటికి తీసుకెళ్లేలా ప్రోత్సహించేందుకు

Har Ghar Tiranga: ఇంత సూపర్‌ హిట్టా?

న్యూఢిల్లీ: ఆజాదీ కా అమృత్ మహాత్సవ్‌లో భాగంగా 76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయులందరూ త్రివర్ణ పతాకాన్ని ఇంటికి తీసుకెళ్లేలా ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండాతో సెల్ఫీ దిగి దాదాపు 6 కోట్ల మంది www.harghartiranga.com వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేశారు. మువ్వన్నెలతో సెల్ఫీలు తీసుకున్న వారు తమ ఫొటోలను వెబ్ సైట్లో ఇంకా అప్ లోడ్ చేస్తున్నారు. జాతీయ భావనను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. 


రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలు విస్తృతంగా పనిచేస్తూ ప్రజలను ఈ మహోద్యమంలో భాగస్వాములను చేయడంలో ప్రోత్సహించాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో క్షేత్రస్థాయిలో కృషి చేశాయి. స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను స్పృశిస్తూ.. ప్రజల్లో దేశభక్తి, ఐకమత్యాన్ని పెంపొందించే లక్ష్యంతో అధికారులు సమాజంలోని అన్ని వర్గాల వారిని కలుపుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం కావడంపై కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు యావద్భారతం ఏకతాటిపైకి వచ్చిందని, భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన చెప్పారు. భారతదేశ ఐకమత్యం, సమగ్రతపై ప్రజలకున్న సత్ సంకల్పానికి ఇదొక నిదర్శనమని కిషన్ రెడ్డి చెప్పారు. భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో నిలపాలన్న ప్రజల వజ్ర సంకల్పానికి ఇది నిదర్శనమన్నారు. 


 






ప్రధాని మోదీ గతంలో ఎల్పీజీ సబ్సిడీని స్వచ్ఛందంగా వదులుకోవాలన్నప్పుడు, కరోనా వారియర్స్‌కు మద్దతుగా నిలవాలన్నప్పుడు.. దేశ ప్రజలు అంతే సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి చెప్పారు. 



Updated Date - 2022-08-17T00:26:36+05:30 IST