సూపర్ టైఫూన్ దెబ్బకు ఫిలిప్పీన్స్ ఛిన్నాభిన్నం

ABN , First Publish Date - 2021-12-20T00:22:48+05:30 IST

ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన సూపర్ టైఫూన్ ‘రాయ్’ కారణంగా ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది.

సూపర్ టైఫూన్ దెబ్బకు ఫిలిప్పీన్స్ ఛిన్నాభిన్నం

మనీలా: ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన సూపర్ టైఫూన్ ‘రాయ్’ కారణంగా ఆ దేశం అతలాకుతలమైంది. దీని దెబ్బకు 100 మందికిపైగా మృతి చెందారని, 3 లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. మరో 8 లక్షల మంది దీని ప్రభావానికి గురైనట్టు వివరించింది. ఈ ఏడాది ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన టైఫూన్ ఇదేనని అధికారులు పేర్కొన్నారు.  


 ‘రాయ్’ దెబ్బకు ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. కమ్యూనికేషన్, విద్యుత్ వ్యవస్థలు కుప్పకూలాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి. గ్రామాల్లోకి వరద ముంచెత్తింది. విద్యుత్ స్తంభాలు కాంక్రీట్‌తో సహా నేలకొరిగాయి.


ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోహోల్ గవర్నర్ అర్థర్ యాప్ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం.. విధ్వంసాన్ని చవిచూసిన తమ ద్వీపంలో ఇప్పటి వరకు 72 మరణాలు సంభవించాయి. డినాగట్ ఐలాండ్స్‌లో మరో పదిమంది ప్రాణాలు కోల్పోయారు.


ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 108 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గంటకు 195 కిలోమీటర్ల (120 మైళ్లు) వేగంతో గాలులు వీచే సూపర్ టైఫూన్‌గా రాయ్ గురువారం దేశంలోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ టైఫూన్ దేశం దాటడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సహాయక చర్యలను ఊపందుకున్నాయి. 

Updated Date - 2021-12-20T00:22:48+05:30 IST