వృద్ధికి ఊతంగా మరిన్ని చర్యలు

ABN , First Publish Date - 2020-09-17T06:14:32+05:30 IST

వృద్ధికి ఊతంగా మరిన్ని చర్యలు

వృద్ధికి ఊతంగా మరిన్ని చర్యలు

  • ఫిక్కీ సదస్సులో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ 


న్యూఢిల్లీ: ఆర్థిక పునరుద్ధరణలో ఇంకా స్థిరత్వం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. అయితే, వృద్ధికి ఊతమిచ్చే చర్యలను చేపట్టేందుకు ఆర్‌బీఐ సిద్ధంగా ఉందన్నారు.  ఫిక్కీ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటైన వర్చువల్‌ సదస్సులో ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ఈమధ్య విడుదల చేసిన జీడీపీ వృద్ధి గణాంకాలు.. కరోనా విధ్వంసానికి ప్రతిబింబమని ఆయన పేరొన్నారు. దాస్‌ ఏమన్నారంటే..


  • వ్యవసాయం, వస్తు తయారీతోపాటు నిరుద్యోగ రేటుపై పలు ఏజెన్సీల అంచనాలు రెండో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు కొంత కుదుటపడ్డాయన్న సంకేతాలిస్తున్నాయి. చాలా రంగాల్లో క్షీణత తగ్గుముఖం పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో పూర్తి స్థిరత్వం రాకపోగా పునరుద్ధరణ నెమ్మదిగానే జరిగే అవకాశం ఉంది. 

  • ఆర్థిక వృద్ధితోపాటు వ్యవస్థలో ద్రవ్య లభ్యత పెంపు, ధరల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఆర్‌బీఐ సదా సిద్ధంగా ఉంది. 

  • ప్రభుత్వం విధానపరమైన చర్యల్లో ఆర్థిక స్థిరీకరణకు ప్రాధాన్యమివ్వాలి. కరోనా సంక్షోభం ముగిశాక శరవేగ వృద్ధి పునరుద్ధరణకు దోహదపడే విధానాలు అవసరం. 

  • కీలక వడ్డీ (రెపో) రేట్ల తగ్గింపు, ద్రవ్య లభ్యత పెంపుతో ఆర్థిక సేవల మార్కెట్లో ఇబ్బందులు గణనీయంగా తగ్గాయి. మార్కెట్లను నిశితంగా గమనిస్తున్నాం. అవసరమైనప్పుడు మరిన్ని చర్యలు చేపడతాం. 

  • వ్యవస్థలోకి ఆర్‌బీఐ నిరంతరం ద్రవ్యం విడుదల చేయడం వల్ల ప్రభుత్వం భారీ మొత్తాల్లో రుణాలను తక్కువ వడ్డీరేట్లకు, మార్కెట్లకు భంగం కలిగించకుండా సేకరించగలిగింది. ప్రస్తుతం ప్రభుత్వ బాండ్లపై వడ్డీరేటు 10 ఏళ్ల కనిష్ఠ స్థాయిలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు కార్పొరేట్‌ కంపెనీలు కూడా బాండ్ల జారీ ద్వారా రూ.3.2 లక్షల కోట్లు సేకరించాయి. 

  • ఎన్‌బీఎ్‌ఫసీల పరిస్థితి సున్నితంగా ఉండటం ఆందోళనకరం. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ తరహా సంక్షోభం పునరావృతం కాకుండా బ్యాంక్‌లతో సమానంగా ఎన్‌బీఎ్‌ఫసీలకూ కఠిన నిబంధనలు ప్రవేశపెట్టేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది.

Updated Date - 2020-09-17T06:14:32+05:30 IST