వరసిద్ధుడి భక్తులకు మరిన్ని సౌకర్యాలు

ABN , First Publish Date - 2021-02-27T05:34:31+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జునరావు తెలిపారు.

వరసిద్ధుడి భక్తులకు మరిన్ని సౌకర్యాలు
మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలిస్తున్న దేవదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు

దేవాదాయ శాఖ కమిషనర్‌ అర్జునరావు


ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 26: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్‌ అర్జునరావు తెలిపారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా వరసిద్ధుడిని దర్శించుకున్నారు. అనంతరం కమిషనర్‌ మాట్లాడుతూ కాణిపాకం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌తో పాటు రూ.30కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రధాన ఆలయ విస్తరణకు సంబంధించి నివేదిక అందగానే అనుమతి మంజూరు చేస్తామన్నారు. పనులు ప్రారంభమైన ఏడాది లోగా పూర్తి చేసేలా చూస్తామన్నారు. భక్తుల బస సౌకర్యం కోసం మరో వంద గదులు, వివాహాలు నిర్వహించుకోవడానికి మరో రెండు కల్యాణ మండపాలు నిర్మించుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే వేద పాఠశాల, ఆస్పత్రి, చిల్డ్రన్స్‌ పార్కు నిర్మించడానికి త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. దేవదాయ శాఖ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూస్తామన్నారు. ఆలయాలల్లో అవినితీ, అక్రమాల నివారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ తెలిపారు. అనంతరం ఆయన ఆలయం వద్ద ఉన్న వసతి సముదాయాన్ని, వంద అడుగుల రోడ్డు, అన్నదాన కేంద్రాన్ని పరిశీలిచించారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్‌బాబు, రాష్ట్ర దేవదాయశాఖ స్తపతి ఎస్సీ శ్రీనివాస్‌, ఈవో వెంకటేశు, ఈఈ వెంకటనారాయణ, ఏఈవో విద్యాసాగరరెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:34:31+05:30 IST