ఏపీఐఐసీ ఎండీకి మరిన్ని అదనపు బాధ్యతలు
ABN , First Publish Date - 2022-10-05T08:24:13+05:30 IST
ఏపీఐఐసీ ఎండీకి మరిన్ని అదనపు బాధ్యతలు
కీలక ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఆంఽధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) వైస్ చైర్మన్ అండ్ ఎండీగా ఇటీవలే పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన నారాయణ భరత్గుప్తాకు ప్రభుత్వం మరిన్ని అదనపు బాధ్యతలు అప్పగించింది. మొన్నటి వరకు ఏపీఐఐసీ వీసీ,ఎండీగా కొనసాగిన జవ్వాది సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసులకు వెళ్లడంతో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న భరత్గుప్తాకు ఆ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఏపీఈడీబీ) సీఈవో భరత్గుప్తానే నియమిస్తూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో క్రిస్ సిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టరుగా, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవల్పమెంట్ అథారిటీ కమిషనర్ బాధ్యతలను కూడా నారాయణ భరత్ గుప్తా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఏపీఐఐసీ కీలక ప్రాజెక్టులు, వాటి పురగతిపై మంగళవారం అధికారులతో తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.