డిసెంబరు వరకు మారటోరియం?

ABN , First Publish Date - 2020-07-08T06:21:40+05:30 IST

కరోనా కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కేందుకు చాలా కాలం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రుణగ్రహీతలకు మారటోరియం (ఈఎంఐ చెల్లింపులకు విరామం)ను మరింత కాలం పొడిగించడమే మేలని కొందరు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు...

డిసెంబరు వరకు మారటోరియం?

  • మళ్లీ గడువు పొడిగించడమే మేలంటున్న బ్యాంకర్లు 


కరోనా కష్టాల నుంచి ఆర్థిక వ్యవస్థ గట్టెక్కేందుకు చాలా కాలం పట్టేలా ఉంది. ఈ నేపథ్యంలో రుణగ్రహీతలకు మారటోరియం (ఈఎంఐ చెల్లింపులకు విరామం)ను మరింత కాలం పొడిగించడమే మేలని కొందరు బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి రుణగ్రహీతలకు ఊరట కల్పించేందుకు ఆర్‌బీఐ తొలుత మార్చి నుంచి మే వరకు (3 నెలలు) మారటోరియం కల్పించింది. తర్వాత కాలంలో ఈ వెసులుబాటును మరో మూడు నెలలు (జూన్‌ నుంచి ఆగస్టు వరకు) పొడిగించింది. కానీ, కరోనా వైరస్‌ ఇంకా అదుపులోకి రాలేదు. పైగా కేసులు నానాటికీ పెరుగుతూ పోతున్నాయి. ఈ వైర్‌సకు టీకా అందుబాటులోకి వచ్చేది 2021లోనేని వైద్య నిపుణులంటున్నారు. లాక్‌డౌన్‌ను దాదాపుగా సడలించినా కొన్ని వ్యాపారాలపై ఆంక్షలు ఇంకా తొలగలేదు. తెరుచుకున్న వ్యాపారాలూ గిరాకీ లేక సతమతమవుతున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ ఏడాది చివరిదాకా గడ్డుకాలమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని నవంబరు లేదా డిసెంబరు వరకు పొడిగించడం తప్ప ఆర్‌బీఐ ముందు ప్రత్యామ్నాయం లేదని సీనియర్‌ బ్యాంకర్లు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోక ముందే మారటోరియంను ముగిస్తే, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్న రుణ ఖాతాల్లో చాలా వరకు మొండిబకాయిలుగా (ఎన్‌పీఏ) మారే ప్రమాదం ఉందని బ్యాంకర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పు తప్పాలంటే మారటోరియాన్ని మళ్లీ పొడిగించడమే మార్గమని వారంటున్నారు. 


పునర్‌వ్యవస్థీకరణకూ అనుమతించాలి.. 

కరోనా దెబ్బకు రుణాలు తిరిగి చెల్లించలేని వారి సంఖ్య మన్ముందు నెలల్లో మరింత పెరిగే అవకాశం ఉందని యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈఓ అమితాబ్‌ చౌదురి అన్నారు. అన్ని విభాగాల (రిటైల్‌, ఎంఎ్‌సఎంఈ, కార్పొరేట్‌) రుణగ్రహీతలు బకాయిల చెల్లింపుల్లో ఇబ్బందులెదుర్కొంటున్నారని ఈ మధ్య ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారి కార్పొరేట్‌ రుణాల పునర్‌వ్యవస్థీకరణకు అనుమతించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వచ్చే 12-18 నెలలు దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి సవాలేనని చౌదురి హెచ్చరించారు. 


బ్యాంకులకు దడ

గడిచిన రెండేళ్ల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో మొండి బకాయిలు (ఎన్‌పీఏ) గణనీయంగా తగ్గా యి. 2018 మార్చి నాటికి 11.6 శాతం ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని నమోదు చేసుకున్న ఎన్‌పీఏలు.. 2020 మార్చి ముగిసేసరికి 8.5 శాతానికి దిగివచ్చాయి. కరోనా దెబ్బకు బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి పెరగవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ హెచ్చరించింది. వచ్చే మార్చి చివరినాటికి బ్యాంకుల మొండిపద్దుల వాటా 13-14 శాతానికి చేరుకోవచ్చని అంచనా వేసింది. మొండి బకాయిల పెరుగుదల బ్యాంకులపై రుణ వ్యయాన్ని పెంచుతుందని, రేటింగ్‌పైనా ప్రభావం చూపనుందని ఈమధ్య విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 


మారటోరియంలో 35-40శాతం రుణాలు 

దేశీయ ఆర్థిక సేవల రంగంలో సగటున 35-40 శాతం రుణాలు మారటోరియంలో ఉండవచ్చని ఎస్‌బీఐ గ్రూప్‌ ప్రధాన ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ అంచనా. ఈ మార్చి నాటికి బ్యాంకింగ్‌ రంగంలోని రుణ ఖాతాల విలువ రూ.104 లక్షల కోట్లు. ఎన్‌బీఎ్‌ఫసీలు రూ.24 లక్షల కోట్లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు మరో రూ.లక్ష కోట్ల మేర రుణాలిచ్చాయని ఎస్‌బీఐ ఎకోవ్రాప్‌ రిపోర్టు పేర్కొంది.

 మొత్తం రూ.129 లక్షల కోట్లలో 35-40 శాతం (రూ.45-51 లక్షల కోట్లు) రుణాలు మారటోరియం ఎంచుకోవచ్చని అంచనా. అందులో 5-10 శాతం (రూ.2.5-5 లక్షల కోట్లు) ఎన్‌పీఏలుగా మారవచ్చని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కరోనా ఉధృతి కొనసాగితే మారటోరియం రుణాల్లో 20 శాతం (రూ.9-10 లక్షల కోట్లు) మొండిపద్దుల్లో చేరవచ్చన్న అంచనాలూ వ్యక్తమవుతున్నాయి. 

- ఆంధ్రజ్యోతి (బిజినెస్‌ డెస్క్‌)


Updated Date - 2020-07-08T06:21:40+05:30 IST