Moosewala Murder case: పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న గ్యాంగ్స్టర్ దీపక్ టిను
ABN , First Publish Date - 2022-10-02T20:33:13+05:30 IST
పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలాహత్య కేసులో నిందితుడైన గ్యాంగ్స్టర్ దీపక్ టినూ శనివారంనాడు..
మాన్సా: పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా (Sidhu Moosewala) హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్స్టర్ దీపక్ టినూ (Deepak Tinu) శనివారంనాడు మాన్సా జిల్లాలో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. మరో కేసులో ప్రొడక్షన్ వారెంట్పై గోంద్వాల్ సాహిబి జైలు నుంచి మన్సా పోలీసులు తీసుకువస్తుండగా టినూ తప్పించుకున్నట్టు పోలీసులు తెలిపారు. టినూ ఇదే కేసులో నిందితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సన్నిహితుడు.
కాగా, పోలీస్ కస్టడీ నుంచి టినూ తప్పించుకున్న విషయాన్ని పాటియాలా రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ముఖ్వీందర్ సింగి ఛినా ధ్రువీకరించారు. పోలీసు బృందాలు టినూ కోసం గాలిస్తున్నాయని, త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పారు. సుభ్దీప్ సింగ్ సిద్ధూ అలియాస్ సిద్ధూ మూసేవాలా పంజాబ్ మాన్సా జిల్లాలో మే 29న హత్యకు గురయ్యాడు. జీపులో తన గ్రామానికి వెళ్తుండగా దారిలో కాపు కాసిన ఆరుగురు షూటర్లు అతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడ మృతిచెందాడు. ఆ వెనువెంటనే ఈ హత్యకు తామే బాధ్యులమంటూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ప్రకటించాడు. మూసేవాలా హత్య కేసులో టినూతో సహా 24 మందిపై పోలీసులు ఛార్జిషీటు నమోదు చేశారు.