కార్పొరేట్ల పంట పండింది : మూడీస్
ABN , First Publish Date - 2021-11-26T09:20:23+05:30 IST
దేశంలో పెరిగిన వ్యాక్సినేషన్, తక్కువ స్థాయి వడ్డీరేట్లు, ప్రభుత్వ పెట్టుబడుల్లో పెరుగుదల కార్పొరేట్లకు సానుకూలమైన అంశాలని మూడీస్ తెలిపింది. కార్పొరేట్ల క్రెడిట్ రేటింగ్ ఫండమెంటల్స్ అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. స్థిరమైన ఆర్థిక రికవరీ
న్యూఢిల్లీ : దేశంలో పెరిగిన వ్యాక్సినేషన్, తక్కువ స్థాయి వడ్డీరేట్లు, ప్రభుత్వ పెట్టుబడుల్లో పెరుగుదల కార్పొరేట్లకు సానుకూలమైన అంశాలని మూడీస్ తెలిపింది. కార్పొరేట్ల క్రెడిట్ రేటింగ్ ఫండమెంటల్స్ అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. స్థిరమైన ఆర్థిక రికవరీ ఇందుకు దారి తీసిందంటూ నానాటికీ పెరుగుతున్న వినియోగ డిమాండ్, అధిక కమోడిటీ ధరల వల్ల కార్పొరేట్ల ఆదాయాలు వచ్చే ఏడాదిన్నర కాలంలో పెరుగుతాయని తాజా నివేదికలో తెలిపింది. భారత ఆర్థిక వృద్ధి బలమైన పునరుజ్జీవం సాధించబోతున్నదంటూ వచ్చే మార్చితో ముగియనున్న 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.3 శాతం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది.
కరోనా సంబంధిత ఆంక్షలు సడలించడంతో వినియోగ డిమాండ్, వ్యయా లు, తయారీ కార్యకలాపాలు క్రమంగా కోలుకోవడం ఆనందదాయకమైన అంశమని మూడీస్ అనలిస్ట్ శ్వేతా పటోడియా అన్నారు. మౌలిక వసతులపై ప్రభుత్వ వ్యయాలు పెరగడం వల్ల ఇనుము, సిమెంట్ వినియోగం పెరుగుతాయని, అలాగే పెరుగుతున్న వినియోగం వల్ల తయారీ కార్యకలాపాలు పెరిగి కొత్త పెట్టుబడులు కూడా వస్తాయని కూడా ఆ నివేదిక తెలిపింది.