Kerala : రుతుపవనాలు రెండు రోజుల ముందే వచ్చేశాయి : వాతావరణ శాఖ

ABN , First Publish Date - 2022-05-29T18:37:46+05:30 IST

సాధారణం కన్నా రెండు రోజుల ముందే రుతుపవనాలు కేరళకు

Kerala :  రుతుపవనాలు రెండు రోజుల ముందే వచ్చేశాయి : వాతావరణ శాఖ

న్యూఢిల్లీ : సాధారణం కన్నా రెండు రోజుల ముందే రుతుపవనాలు కేరళకు వచ్చాయని వాతావరణ శాఖ (India Meteorological Department) ఆదివారం ఉదయం తెలిపింది. సాధారణంగా జూన్ 1న ఇవి వస్తాయని వివరించింది. మే 14న విడుదల చేసిన ప్రకటనలో రుతుపవనాలు మే 27న కేరళలో ప్రవేశిస్తాయని అంచనా వేసింది. 


రుతుపవనాల రాక గురించి ప్రకటించడానికి గురువారం తగిన పరిస్థితులు లేవని పేర్కొంది. అయితే శుక్రవారం కాస్త మెరుగుదల కనిపించినట్లు తెలిపింది. తాజా సూచనల ప్రకారం దక్షిణ అరేబియా సముద్రంపైన దిగువ స్థాయుల్లో పశ్చిమ గాలులు బలపడినట్లు శుక్రవారం తెలిపింది. ఉపగ్రహ ఛాయాచిత్రాలనుబట్టి కేరళ తీరం, దాని పరిసరాల్లోని ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఆకాశం మేఘావృతమైందని, కేరళకు రుతుపవనాలు మరో రెండు, మూడు రోజుల్లో వచ్చేందుకు సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని శుక్రవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు మరికొన్ని అరేబియా సముద్ర ప్రాంతాలు, లక్షద్వీప్‌లకు మరో రెండు, మూడు రోజుల్లో  చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. 



Updated Date - 2022-05-29T18:37:46+05:30 IST