వానరాలను వదలడం లేదు!
ABN , First Publish Date - 2022-05-25T06:18:57+05:30 IST
వానరాలను వదలడం లేదు.. పట్టుకుని తరలించేస్తున్నారు.
అరటిపండ్లతో కొండముచ్చులకు ఎర
ఆటోలో బంధించి తరలింపు
చీపురుగూడెంలో ఘటన
ఎదురుతిరిగిన రైతాంగం..తెలియదన్న డీఎఫ్వో
నల్లజర్ల, మే 24 : వానరాలను వదలడం లేదు.. పట్టుకుని తరలించేస్తున్నారు. ఎక్కడికి తరలిస్తున్నారో.. ఎందుకు తరలిస్తున్నారో తెలియదు. .మొత్తం మీద మాటు వేసి పట్టుకుంటున్నారు. పొలాల్లో అరుదుగా ఉండే కొండముచ్చి కోతులను కొంత మంది బోనులో బంధించి తీసుకు పోతున్నారు. నల్లజర్ల మండలం చీపురుగూడెంలో మంగళవారం ఉద యం కొయ్యలగూడెం నుంచి ఆటోలో ఒక మహిళ ముగ్గురు వ్యక్తులు వచ్చి కొండముచ్చులను పట్టుకోవడానికి ప్రయత్నించారు. స్థానిక రైతు లు కొండముచ్చులను ఎందుకు పట్టుకుంటున్నారని పశ్నించారు. అటవీ అధికారులు చెప్పారని తోటలో ఉన్న మూడు కొండముచ్చులకు అరటి పండ్లు ఎరగా చూపించి వలవేసి బంధించారు. అనంతరం ఆటో లో ఉన్న బోనులో వేసుకుని పోతుండగా రైతులు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించడంతో ఆటోలో బంధించిన కొండ ముచ్చులు కనిపించకుండా టార్ఫాలిన్ కప్పి అక్కడ నుంచి జారుకున్నారు. అటవీ అధికారులు పట్టుకోమంటే ఎందుకు టార్ఫాలిన్ కప్పారు. ఎందుకు పట్టుకుంటున్నారనేది అనుమానాస్పదంగా మారింది. దీనిపై ఆంధ్రజ్యోతి నల్లజర్ల డీఆర్వో వెంకటేశ్వరరావును వివరణ కోరగా బహిరంగ ప్రదేశాల్లో ఉండే కొండముచ్చులు, కోతులను కన్నాపురం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుందన్నారు.అయితే కొండముచ్చులను పట్టుకున్న వారి గురించి మా వద్ద సమాచారం లేదన్నారు.