దారులన్నీ ‘సిరి’ వైపే!

ABN , First Publish Date - 2020-10-30T06:03:10+05:30 IST

లోకంలో ఎప్పుడూ మనకు బలం, బలగం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏది ఉండేలా చూసుకోవాలి? ఏది ఉంటే మన దగ్గరకు నలుగురు మనుషులు వస్తారు? దాన్నే ‘లౌక్యం’ అంటారు. లౌక్యం దుర్గుణం కాదు. అలవాటు చేసుకోవాల్సిన గుణం...

దారులన్నీ ‘సిరి’ వైపే!

లోకంలో ఎప్పుడూ మనకు బలం, బలగం ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏది ఉండేలా చూసుకోవాలి? ఏది ఉంటే మన దగ్గరకు నలుగురు మనుషులు వస్తారు? దాన్నే ‘లౌక్యం’ అంటారు. లౌక్యం దుర్గుణం కాదు. అలవాటు చేసుకోవాల్సిన గుణం. ఎదుటివారిని మోసం చేసేందుకు ఉపయోగించనంత వరకు లౌక్యం చాలా మంచిది. మనం బాగుండటానికి, మన ద్వారా పదిమంది బాగుండటానికి లౌక్యంగా మాట్లాడే మాట ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా మాట్లాడాలి. అలా లౌక్యంగా మాట్లాడే వారిని ప్రశంసించాలి. లోకంలో ఎప్పుడూ డబ్బున్న వాడి దగ్గరికే అందరూ చేరతారు. ఈ విషయం గురించి మారద వెంకయ్య రచించిన భాస్కర శతకం ద్వారా తెలుసుకుందాం. 


  • శ్రీగల భాగ్యశాలి గడు జేరగవత్తురు తారుదారె దూ
  • రాగమన ప్రయాసమున కాదటనోర్చియునైన నిల్వ ను 
  • ద్యోగము చేసి, రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్‌
  • సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా.

లోకంలో ఎప్పుడూ డబ్బు ఉన్న వాడి దగ్గరకే అందరూ చేరతారు. ఎవ్వరూ పిలవకపోయినా వాళ్లంతట వారే వచ్చి చేరతారు. శ్రమపడైనా సరే వస్తారు. డబ్బు ఖర్చు పెట్టుకొనైనా సరే డబ్బు ఉన్న వాళ్ల దగ్గరకు చేరతారు. డబ్బు ఉన్న వాళ్లతో నాలుగు రోజులు గడపడానికి ప్రయత్నిస్తారు. దానికి మంచి ఉదాహరణ సముద్రంలోకే అన్ని నదులు చేరతాయి. సముద్రంలో రకరకాల రత్నాలుంటాయి. అన్ని ఉన్నాయి కాబట్టే నదులన్నీ సముద్రంలోకి చేరుతున్నాయి. అలాగే నీదగ్గర నాలుగు రూపాయలు ఉంటేనే నలుగురూ చేరతారు. అంటే జీవితంలో ఎప్పుడూ ధనం లేని దీనస్థితికి  వెళ్లకుండా చూసుకోవాలి. 

- గరికిపాటి నరసింహారావు


Updated Date - 2020-10-30T06:03:10+05:30 IST