అందని టీకా.. మొక్కుబడిగానే ఉత్సవ్!
ABN , First Publish Date - 2021-04-13T05:48:34+05:30 IST
కరోనా టీకా కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తగినంత టీకాను రాష్ట్రానికి సరఫరా చేయకపోవటంతో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు చేపడుతున్న టీకా ఉత్సవ్ సత్ఫలితాలు ఇవ్వడం లేదు
పూర్తిస్థాయిలో జిల్లాకు చేరని వ్యాక్సిన్
కేవలం 20 కేంద్రాలలోనే అమలు
14న సచివాలయాల్లో నిర్వహిస్తాం
ఒక్కో కేంద్రంలో కేవలం 500 మందికే : డీఎంహెచ్వో
నెల్లూరు(వైద్యం) : కరోనా టీకా కొరత జిల్లాలో తీవ్రంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తగినంత టీకాను రాష్ట్రానికి సరఫరా చేయకపోవటంతో ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు చేపడుతున్న టీకా ఉత్సవ్ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. కావల్సిన టీకా అందుబాటులో లేక పోవడంతో జిల్లాలోని 357 టీకా ఉత్సవ్ కేంద్రాలలో టీకాలు వేయడం ఆపేశారు. కేవలం 20 కేంద్రాలలోనే మొక్కుబడిగా సాగుతోంది. ఈ నేపఽథ్యంలో డీఎంహెచ్వో డాక్టర్ రాజ్యలక్ష్మి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీకా లేని కారణంగా కేవలం ఈ నెల 14వ తేదీన మాత్రమే టీకా ఉత్సవ్ జరిగేలా ఏర్పాటు చేశారు. జిల్లాలోని 357 గ్రామ, వార్డు సచివాయాల్లో ఈ ఉత్సవ్ నిర్వహించనున్నారు. ఒక్కో కేంద్రంలో కేవలం 500 మందికే టీకా వేసేలా కార్యాచరణ రూపొందించారు. ఇదిలా ఉంటే ఇంతవరకు జిల్లాకు అవసరమైన కరోనా టీకా రాలేదు.
కొత్తగా 245 పాజిటివ్లు
జిల్లాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. సోమవారం 245 పాజిటివ్లు నమోదు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,721లకు చేరుకున్నాయి. అలాగే కరోనా నుంచి కోలుకోలేక ఇద్దరు మృత్యువాత పడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న 108 మందిని అధికారులు డిశ్చార్జ్ చేశారు.