మోహన్‌లాల్‌ ఫోన్‌ చేశారు...

ABN , First Publish Date - 2020-12-27T06:18:36+05:30 IST

కేరళకు చెందిన ఈ అమ్మాయి పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. అందుకు కారణం ఈ 21ఏళ్ల బీఎస్సీ సెకెండ్‌ ఇయర్‌ విద్యార్థిని తొలి ఎన్నికలోనే గెలుపొందారు.

మోహన్‌లాల్‌ ఫోన్‌ చేశారు...

ఆర్యా రాజేంద్రన్‌...

కేరళకు చెందిన ఈ అమ్మాయి పేరు ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. అందుకు కారణం ఈ 21ఏళ్ల బీఎస్సీ సెకెండ్‌ ఇయర్‌ విద్యార్థిని తొలి ఎన్నికలోనే గెలుపొందారు. కేరళ రాజధాని తిరువనంతపురానికి తదుపరి మేయర్‌గా ఆమె పేరు దాదాపు ఖరారయింది. అంతేకాదు దేశంలోనే అతి చిన్న వయసున్న మేయర్‌గా చరిత్ర సృష్టించబోతున్నారు.  నగర పాలనలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్న ఈ యువతరం ప్రతినిధి చెబుతున్న సంగతులివి...


‘‘నాకు రాజకీయాలపై ఆసక్తి ఏర్పడడానికి కారణం నా కుటుంబమే. మా నాన్న కె.ఎం. రాజేంద్రన్‌తో పాటు మా అమ్మ శ్రీలత, మా అన్నయ్య అరవింద్‌ అందరూ సీపీఎం సభ్యులే. ఇంట్లో ఎప్పుడూ రాజకీయపరమైన చర్చలు జరుగుతూ ఉండేవి. ‘మాది పార్టీ  కుటుంబం’ అని మా నాన్న గర్వంగా చెబుతూ ఉండేవారు. అలా చిన్నప్పటి నుంచే నా జీవితంలో రాజకీయాలు ఒక భాగం అయ్యాయి. 


తిరువనంతపురంలోని దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో మా కుటుంబం ఒకటి. నాన్న ఎలక్ర్టీషియన్‌.  అమ్మ ఎల్‌ఐసి ఏజెంట్‌. నన్నూ, అన్నయ్యనూ బాగా చదివించాలని మా అమ్మానాన్నా బాగా కష్టపడ్డారు.   ఆటోమొబైల్‌ ఇంజనీరింగ్‌ చేసిన మా అన్నయ్య ఉద్యోగం కోసం మధ్యప్రాచ్యం వెళ్ళాడు.. ప్రస్తుతం ఓ చిన్న ఇంట్లో ఉంటున్నాం. నెలకు ఆరువేల అద్దె కడుతున్నాం. ఇన్ని ఇబ్బందులున్నా... రాజకీయాల్లోకి వెళ్ళాలనే నా కోరికను అమ్మానాన్న ఎప్పుడూ కాదనలేదు. 


సీపీఎంతో నా అనుబంధం అయిదో తరగతి చదువుతున్నప్పుడు ఏర్పడింది. పిల్లల కోసం ‘బాలసంఘం’ పేరుతో ఒక సంస్థను ఆ పార్టీ నిర్వహిస్తోంది. దానిలో సభ్యురాలుగా చేరాను. సమాజం పట్ల బాధ్యతగా ఎలా ఉండాలి, సొంత వ్యక్తిత్వాన్ని ఎలా ఏర్పరచుకోవాలి! ఇలా అనేక విషయాలు అక్కడ నేర్చుకున్నాను. నాదైన స్వతంత్ర దృక్పథం రూపుదిద్దుకోవడంలో బాలసంఘం పాత్ర ఎంతో ఉంది. ఆ తరువాత సంఘం జిల్లా అధ్యక్షురాలిగా చేశాను. రెండేళ్ళ నుంచీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటున్నాను. ‘బాల సంఘం’లో నేను క్రియాశీలంగా ఉండడాన్ని పార్టీ గమనించింది. సీపీఎం విద్యార్థి విభాగమైన స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎ్‌ఫఐ)లో స్థానం కల్పించింది. ఎస్‌ఎ్‌ఫఐ రాష్ట్ర కమిటీలో కూడా పని చేశాను. దీనివల్ల రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లోనూ పర్యటించే అవకాశం దొరికింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యల గురించి అవగాహన ఏర్పడింది. నా మీద నమ్మకంతో తిరువనంతపురం కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా పార్టీ పెద్దలు అడిగారు. ముదవన్‌గల్‌ వార్డు నుంచి బరిలోకి దిగాను. 


యువతకు రాజకీయాలేంటన్నారు...

నేను ప్రస్తుతం ఆల్‌ సెయింట్స్‌ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాను. మా అధ్యాపకులు, తోటి విద్యార్థులు నాకు పూర్తి మద్దతునిచ్చారు. అయితే నా పరిచయస్తుల్లో కొందరు సానుకూలంగా స్పందించినా, మరికొందరు చదువుకుంటున్న సమయంలో రాజకీయాలు ఎందుకన్నారు. విద్యార్థి రాజకీయాలను నేను గట్టిగా సమర్థిస్తాను. కొన్నేళ్ళుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా చదువును నిర్లక్ష్యం చెయ్యలేదు. రాజకీయాలతో పాటు చదువు మీద కూడా అంతే దృష్టి కేంద్రీకరించాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు చాలామంది మహిళలు నాకు సూచించారు. అలాగేనని వారికి మాట ఇచ్చాను. ఈ ఎన్నికలను నేను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కొన్నాను. వయసు తక్కువ, ప్రత్యక్ష రాజకీయాల్లో అనుభవం లేమి... ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలు నన్ను కార్పొరేటర్‌గా గెలిపించారు. మా పార్టీకి కూడా మెజార్టీ సీట్లు రావడంతో మేయర్‌ అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది. మేయర్‌ పదవికి అభ్యర్థిగా నా పేరును సీపీఎం జిల్లా సచివాలయం సిఫార్సు చేసింది.  


ప్రజల వైఖరి మారాలి.

 మా నాన్నే నాకు తొలి రాజకీయ గురువు. ‘వ్యక్తి కన్నా పార్టీయే అత్యున్నతం’ అని ఆయన ఎప్పుడూ అంటూ ఉంటారు. కాబట్టి పార్టీ నిర్ణయమే అంతిమం. ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా స్వీకరిస్తాను. మేయర్‌ అయితే చేయాలనుకుంటున్న పనులు ఎన్నో ఉన్నాయి. మాది అందమైన నగరం. కానీ నగర పరిశుభ్రత విషయంలో ప్రజల వైఖరి మారాలి. కొందరు ఇప్పటికీ రోడ్ల మీద చెత్త పడేస్తున్నారు. దీనివల్ల కలిగే నష్టాలపై వారికి అవగాహన కలిగిస్తాను. శాస్త్రీయమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను. ప్రజా సంక్షేమం కోసం పని చెయ్యడం, నా చదువు కొనసాగించడం... ఇప్పుడు ఇవే నా ప్రాధామ్యాలు. క్రిస్మ్‌సకు ముందు జరిగే మూడు పరీక్షలకు హాజరుకాలేకపోయాను. మిగిలినవి రాయడానికి సిద్ధం అవుతున్నాను.


నమ్మకం నిలబెట్టుకుంటా...

 ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నేను అభిమానిని. అలాగే రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కె.కె. శైలజను చూసి ఎంతో స్ఫూర్తి పొందుతున్నాను. సంక్షోభ సమయాల్లో వారు వ్యవహరించే తీరు నన్ను ఎంతో ఆకర్షిస్తుంది. వ్యక్తిగత అభిరుచుల విషయానికొస్తే... నాకు సినిమాలంటే ఇష్టం. నేను మోహన్‌లాల్‌ అభిమానిని. అన్నట్టు మోహన్‌లాల్‌ పూర్వీకుల ఇల్లు మా వార్డులోనే ఉంది. నేను ఎన్నిక వగానే ఆయన ఫోన్‌ చేసి అభినందించడం సంతోషంగా అనిపించింది. ఆరోగ్యం, విద్య... వీటికి ప్రాధాన్యామిస్తూ, ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా ముందున్న కర్తవ్యం. అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.’’


సమాజంలో మార్పు తేగలిగేది యువతే. అందుకే వాళ్ళు రాజకీయాల్లో చురుగ్గా పాలుపంచుకోవాలి. క్యాంపస్‌ రాజకీయాలను నిషేధించడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. దీనివల్ల చదువు దెబ్బతింటుందనే వాదన కూడా సరికాదు. 

Updated Date - 2020-12-27T06:18:36+05:30 IST