ఇకపై కశ్మీరీ పండిట్ల జోలికి ఎవరూ రాలేరు : మోహన్ భగవత్
ABN , First Publish Date - 2022-04-03T21:41:09+05:30 IST
కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన పండిట్లు మళ్లీ
న్యూఢిల్లీ : కశ్మీరు లోయ నుంచి 1990వ దశకంలో తరిమివేయబడిన పండిట్లు మళ్లీ అక్కడికి వెళితే, వారిని మరోసారి ఎవరూ నిర్వాసితులను చేయబోరని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. నవ్రేహ్ వేడుకల చివరి రోజు అయిన ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కశ్మీరీ హిందువులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
కశ్మీరీ పండిట్లు తమ ఇళ్ళకు వెళ్లే రోజు చాలా దగ్గరలోనే ఉందని భావిస్తున్నానని చెప్పారు. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తీవ్రవాదం వల్ల కశ్మీరును వదిలిపెట్టామని, ఇప్పుడు మళ్లీ తిరిగి వెళ్తామని, హిందువులుగా, భారత దేశ భక్తులుగా వెళ్తామని, మా భద్రత, జీవినోపాధి పట్ల భరోసాతో వెళ్తామని కశ్మీరీ పండిట్లు దృఢ సంకల్పంతో ఉండాలని చెప్పారు. ‘‘ఎవరూ మమ్మల్ని నిర్వాసితులను చేసే సాహసం చేయబోరనే విధంగా మేం జీవిస్తాం’’ అనే దృఢసంకల్పంతో వ్యవహరించాలని తెలిపారు.
గడచిన మూడు, నాలుగు దశాబ్దాల నుంచి స్వదేశంలో కశ్మీరీ పండిట్లు తమ స్వగృహాల నుంచి తరిమివేయబడటంతో అనేక కష్టాలను అనుభవిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఓటమిని అంగీకరించకూడదని, సవాళ్ళను ఎదుర్కొనాలని చెప్పారు. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా కశ్మీరు పండిట్లు నిరాశ్రయులైన దురదృష్టకర వాస్తవాన్ని తెలియజేసిందన్నారు. మనందరినీ దిగ్భ్రాంతికి గురి చేసిన దారుణాన్ని వివరించిందన్నారు. ప్రజలు అవగాహన పెంచుకోవడం ద్వారా మాత్రమే కశ్మీరీ పండిట్ల సమస్య పరిష్కారమవుతుందని తాను గతంలో చెప్పానన్నారు. అధికరణ 370 వంటి అడ్డంకులు తొలగిపోయాయన్నారు. 2011 తర్వాత మనందరి కృషి ఫలితంగా అధికరణ 370 అడ్డంకి తొలగిపోయిందని చెప్పారు.