ఒకే వేదికపై మోహన్ భగవత్, ములాయం సింగ్... కాంగ్రెస్, సమాజ్‌వాదీ ట్వీట్ల వార్...

ABN , First Publish Date - 2021-12-21T20:04:02+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ (సపా) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్

ఒకే వేదికపై మోహన్ భగవత్, ములాయం సింగ్... కాంగ్రెస్, సమాజ్‌వాదీ ట్వీట్ల వార్...

న్యూఢిల్లీ : సమాజ్‌వాదీ పార్టీ (సపా) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ ఒకే వేదికపై కలిసిన ఫొటో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ట్విటర్ వార్‌కు దారి తీసింది. ఈ నేతలిద్దరూ ఒకే సోఫాలో కూర్చున్నట్లు కనిపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవడంతో కాంగ్రెస్ ఉత్తర ప్రదేశ్ శాఖ స్పందిస్తూ, ఈ ఫొటోను షేర్ చేసి, ‘‘నూతన సపాలో స అంటే సంఘ్‌వాది అని అర్థమా? అని ప్రశ్నించింది. 


దీనిపై బీజేపీ ఉత్తర ప్రదేశ్ శాఖ స్పందిస్తూ, అదే ఫొటోను షేర్ చేసి, ‘‘ఓ బొమ్మ చాలా చెప్తుంది’’ అని పేర్కొంది. కాసేపటి తర్వాత అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (సపా) కూడా స్పందించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్ పరస్పరం నమస్కరించుకుంటున్నట్లు కనిపిస్తున్న ఫొటోను షేర్ చేసింది. కాంగ్రెస్ రాజకీయ గౌరవ, మర్యాదలను మర్చిపోయిందని మండిపడింది. కాంగ్రెస్ పెట్టిన ఫొటో ఏ కార్యక్రమంలో తీశారో, అదే కార్యక్రమంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎన్‌సీపీ నేతలు కూడా ములాయం సింగ్ యాదవ్ ఆశీర్వాదాలు తీసుకున్నారని పేర్కొంది. దీని గురించి కాంగ్రెస్ ఏం చెప్తుందని ప్రశ్నించింది. 


ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడి మనుమరాలు వివాహం సందర్భంగా ఢిల్లీలో ఇచ్చిన విందులో మోహన్ భగవత్, ములాయం సింగ్ యాదవ్ పాల్గొన్నారు. 




Updated Date - 2021-12-21T20:04:02+05:30 IST