రెండు సార్లు గెలిచి ఏం చేశావు?: ఏపీ మంత్రిని ప్రశ్నించిన మోహన్ బాబు

ABN , First Publish Date - 2022-01-02T19:48:26+05:30 IST

‘రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావు?’ అంటూ ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు.

రెండు సార్లు గెలిచి ఏం చేశావు?: ఏపీ మంత్రిని ప్రశ్నించిన మోహన్ బాబు

హైదరాబాద్: ‘రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశావు?’ అంటూ ఏపీ పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ను సినీ నటుడు మోహన్ బాబు ప్రశ్నించారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఫిల్మ్ నగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ రఘురామకృష్ణ రాజు, సూపర్ స్టార్ కృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ.. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఛలోక్తులు విసిరారు. ‘అల్లూరి సీతారామరాజు పుట్టిన గడ్డపై రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కోసం ఏం చేశావు?’ అంటూ వేదికపైనే నిలదీశారు. అయితే పక్కనే ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కలుగజేసుకుని వదిలేయమనడంతో ‘కిషన్ రెడ్డి చెప్పారు కాబట్టి వదిలేస్తున్నా’ అంటూ మోహన్ బాబు నవ్వులు పూయించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ తనకు మంచి మిత్రుడని మోహన్ బాబు చెప్పారు. అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం రూ. 300లకే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశానని మోహన్ బాబు అన్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేసేలా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలని కోరారు.



Updated Date - 2022-01-02T19:48:26+05:30 IST