ప్రధాని మోదీ పర్యటన.. బీబీఎంపీపై రూ.23 కోట్ల భారం

ABN , First Publish Date - 2022-06-22T16:22:03+05:30 IST

ప్రధాని బెంగళూరులో ఒకరోజు పాల్గొన్న కార్యక్రమాల కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) చేసిన ఖర్చు ఎంతో తెలుసా..?

ప్రధాని మోదీ పర్యటన.. బీబీఎంపీపై రూ.23 కోట్ల భారం

బెంగళూరు, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాని బెంగళూరులో ఒకరోజు పాల్గొన్న కార్యక్రమాల కోసం బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) చేసిన ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా 23 కోట్ల రూపాయలు. ఇలా ఎందుకు ఖర్చు అయిందని ఆశ్చర్యపోతున్నారా...? ప్రధాని మోదీ బెంగళూరు నగరంలో ఏకధాటిగా పలు కార్యక్రమాల్లో నాలుగు గంటలపాటు పాల్గొన్నారు. ఇందుకో సం ప్రధాని సంచరించే మార్గాల్లో రహదారుల ఆధునికీకరణ కోసం ఆగమేఘాలమీద బీబీఎంపీ వారం ముందే రంగంలోకి దిగింది. రమారమి 14 కిలోమీటర్ల మేర ఫుట్‌పాత్‌లను, తారురోడ్లను వీధిదీపాలను ఏర్పాటు చేసింది. ప్రధాని ప్రయాణించే మార్గంలో రహదారులను అద్దంలా మెరిసేలా చేసేందుకు ఈ మొత్తాన్ని ఖర్చు చేసింది. ప్రధాని పర్యటన ఒక కారణమైనా ప్రజలకు ఈ రహదారులు నిత్యం ఉపయోగపడతాయని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. ప్రత్యేకించి ప్రధాని ప్రయాణించిన మార్గంలో వీధి దీపాలకు ఆగమేఘాల మీద మరమ్మతులు చేశారు. నిన్నటివరకు చీకట్లో ఉన్న అనేక ప్రాంతాలు విద్యుద్దీపాల కాంతులతో ధగధగలాడాయి. ప్రధాని ప్రయాణించిన మార్గంలో గుంతల పూడ్చివేత, తారురోడ్డు, రహదారుల ఆధునికీకరణకు రూ.14 కోట్ల వరకు అయినట్టు తెలుస్తోంది. నగర స్వచ్ఛత ఇతరత్రా పనులకోసం రూ.9 కోట్ల దాకా ఖర్చు చేశారు. దీనిపై ఆమ్‌ ఆద్మీ పార్టీ స్పందిస్తూ ప్రధాని నెలలో ఒకసారి నగరంలో నాలుగుమూలలా సంచరిస్తే నగరంలోని అధ్వాన్న రోడ్లకు కొంతమేరకైనా విముక్తి లభిస్తుందని ట్వీట్‌ చేయడం గమనార్హం. 

Updated Date - 2022-06-22T16:22:03+05:30 IST