ఆరోగ్యానికి ఓ కార్డు
ABN , First Publish Date - 2020-08-15T08:09:26+05:30 IST
‘వన్ నేషన్.. వన్ హెల్త్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా చేసే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని సమాచారం...
- కేంద్రం కొత్త పథకం వన్ నేషన్.. వన్ హెల్త్
- ఎర్రకోట నుంచి ప్రసంగంలో భాగంగా
- నేడు ప్రకటించనున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ, ఆగస్టు 14: ‘వన్ నేషన్.. వన్ హెల్త్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఎర్రకోట వేదికగా చేసే స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని సమాచారం. ఈ పథకంలో.. ఆధార్ మాదిరిగానే ప్రతి పౌరుడికీ ‘ఆరోగ్య గుర్తింపు సంఖ్య’ను అందజేస్తారు. ఇందుకోసం జాతీయ ఆరోగ్య సంస్థ(ఎన్హెచ్ఏ) రూ. 400 కోట్లతో ‘డిజిటల్ ఎకో సిస్టమ్ ప్లాన్’ పేరుతో పోర్టల్, యాప్లను అభివృద్ధి చేసింది. జాతీయ డిజిటల్ ఆరోగ్య మిషన్(ఎన్డీహెచ్ఎం) ఈ విధానానికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. ఈ పథకంలో పౌరులు తమ ఆరోగ్య డేటాను ‘ఈ-రికార్డులు’గా అప్ లోడ్ చేసుకోవచ్చు.
భవిష్యత్లో వారికి చికిత్సను అందజేసే సమయంలో ఈ డేటాను వైద్యులు, ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే.. పౌరులు ఎలాంటి ప్రిస్ర్కిప్షన్ లేకుండా ఆస్పత్రికి వెళ్లినా.. వారి ఆరోగ్య గుర్తింపు సంఖ్య ఆధారంగా డాక్టర్లు హెల్త్ రికార్డులను పరిశీలించి.. వైద్యం అందజేసే అవకాశాలుంటాయి. వైద్యులు, ఆస్పత్రులు, హెల్త్కేర్ సెంటర్లు కూడా ప్రత్యేకంగా ఇందులో రిజిస్ర్టేషన్ చేసుకోవచ్చు. ఈ-ఫార్మసీ, టెలిమెడిసిన్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. వైద్యులు తమ పేషెంట్లకు ఆన్లైన్ ద్వారా ప్రిస్ర్కిప్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్/యా్పలో పౌరులు, డాక్టర్లు స్వచ్ఛందంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. వారి డేటాను ఇతరులు యాక్సెస్ చేసే అవకాశం ఉం డదు. దశల వారీగా ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తారు. మెడికల్ షాపులనూ క్రమంగా ఈ నెట్వర్క్లో చేరుస్తారు. ఈ పథకంలో చేరాలా? వద్దా? అనేదానిపై తుది నిర్ణయం పౌరులదే. ఈ పథకంలో చేరిన పౌరులకు విశిష్ఠ గుర్తింపు సం ఖ్య, ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకునేలా ‘వన్ నేషన్ వన్ హెల్త్’ కార్డులను అందజేస్తారు.
వరుసగా ఏడోసారి..!
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ వరుసగా ఏడో సారి ఎర్రకోట నుంచి ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. చైనా సరిహద్దుల్లో సంక్షోభం, కరోనా వైరస్ నేపథ్యంలో మోదీ ప్రసంగంపైనే అందరి దృష్టీ ఉంది. ప్రధాని భద్రతకు మొట్టమొదటిసారిగా మహిళా సైన్యాధికారిని నియమించారు. ప్రధాని జెండావందనం చేసేప్పుడు మేజర్ శ్వేతాపాండే ఆయనకు భద్రతగా, సహాయకురాలిగా ఉంటారు. ఈ సారి పంద్రాగస్టు వేడుకలకు 4 వేల మంది అతిథులను ఆహ్వానించారు. కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్క్లు ధరించి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా అతిఽథులను కోరారు. ముందు జాగ్రత్త చర్యగా ఎర్రకోటకు దారితీసే మార్గాల్లో భద్రతను ముమ్మరం చేశారు. బహుళ అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్ఎ్సజీ, ఎస్పీజీ, ఐటీబీపీ బలగాలను మోహరించారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశప్రజలకు అభినందనలు తెలిపారు.