Deogarh విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ.. Baidyanath ఆలయంలో పూజలు
ABN , First Publish Date - 2022-07-12T23:19:37+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖాండ్లో రూ.16,8000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారంనాడు..
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జార్ఖాండ్ (Jharkhand)లో రూ.16,8000 కోట్లకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారంనాడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 673 ఎకరాల విస్తీర్ణంలో, రూ .401 కోట్ల వ్యయంతో నిర్మించిన డియోఘర్ విమానాశ్రయాన్ని (Deoghar Airport) ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన బాబా బైధ్యనాథ్ (Baba baidyanath) ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. వేదమంత్రాలు, శంఖారావాల మధ్య రుద్రాభిషేకం చేశారు. ఈనెల 14 నుంచి శ్రావణ మేళా ప్రారంభం కానుండటంతో బైద్యనాథుని దర్శనానికి వేలాది మంది భక్తులు, యాత్రికులు తరలి వస్తున్నారు.
కాగా, ప్రధానికి జార్ఖాండ్లో మంగళవారం ఉదయం ఘనస్వాగతం లభించింది. రోడ్లకిరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. అనంతరం డియోఘర్ విమానాశ్రయాన్ని అధికారికంగా మోదీ ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం నుంచి కోల్కతాకు ప్రారంభమైన ఇండిగో విమాన సర్వీసును కూడా జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పాల్గొన్నారు. 2018 మే 25న ఈ విమానాశ్రయానికి మోదీ శంకుస్థాపన చేశారు.
ప్రధాని జార్ఖాండ్ పర్యటనలో భాగంగా డియోఘర్లోని ఎయిమ్స్లో ఇన్-పేషెంట్ డిపార్ట్మెంట్, ఆపరేషన్ థియేటర్ సేవలను కూడా ప్రారభించారు. పలు రోడ్లు, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు.