మోదీయే పెద్ద విధ్వంసకారి: మమత
ABN , First Publish Date - 2021-02-25T06:54:48+05:30 IST
ప్రధాని మోదీ దేశంలోనే అతి పెద్ద దొమ్మీకోరు, విధ్వంసకారి అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు.
సహగంజ్, ఫిబ్రవరి 24: ప్రధాని మోదీ దేశంలోనే అతి పెద్ద దొమ్మీకోరు, విధ్వంసకారి అని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. బెంగాల్లో లంచాల సంస్కృతి రాజ్యమేలుతోందని, తృణమూల్ గూండాల స్వైరవిహారంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని మోదీ రెండ్రోజుల కిందట హుగ్లీ జిల్లాలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో నిప్పులు చెరిగారు.
మమత అదే జిల్లాలో బుధవారం జరిపిన సభల్లో వాటికి దీటుగా బదులిచ్చారు. తృణమూల్ను మోదీ తోలాబాజ్ (దోపిడీదారు) అని దూషించడంతో మమత ఆయనను దంగాబాజ్ (దొమ్మీకోరు) అనీ, దేశానికి పట్టిన దెయ్యమనీ అభివర్ణించారు. బొగ్గు కుంభకోణంలో తన మేనల్లుడు, తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా బెనర్జీని సీబీఐ ప్రశ్నించడంపై మమత తీవ్రంగా మండిపడ్డారు.