చారిత్రక సంస్కరణలు, విజయాలు మోదీ ఘనత: యోగి
ABN , First Publish Date - 2020-05-30T20:25:19+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'విశిష్ట నాయకత్వం'లో ఎన్డీయే-2 ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు..
లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'విశిష్ట నాయకత్వం'లో ఎన్డీయే-2 ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభాభినందనలు తెలియజేశారు. చారిత్రక సంస్కరణలు, సాధించిన విజయాలకు వేదకగా ఏన్డీయే-2 ఏడాది పాలన నిలిచిందని అభివర్ణించారు.
ప్రధాని మోదీ 'సబ్ కా సాథ్, సబ్కా వికాస్' మంత్రాన్ని సాకారం చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని శనివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మోదీ తొలి దశ ఐదేళ్ల పాలనలో భారత్ను ప్రపంచంలోనే ఆర్థిక సూపర్ పవర్గా నిలిపారని, రెండో ఐదేళ్ల పాలన 'ఏక్ భారత్, శ్రేష్ట భారత్' లక్ష్య సాధన దిశగా దూసుకువెళ్తోందని చెప్పారు. ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా మహిళా గౌరవం పాదుకొలిపారని, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు 370వ అధికరణను రద్దు చేసారని, రామ జన్మభూమి నిర్ణయం, పౌరసత్వ చట్టం తీసుకురావడంతో పాటు, దేశంలోని రైతులు, యువతకు పట్టం కట్టారని అన్నారు. ప్రధాని సకాలంలో తీసుకున్న చర్యలతో కరోనా వైరస్కు కళ్లెం వేశారని యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు.