మోదీ ‘మెగా’ ముచ్చట్లు
ABN , First Publish Date - 2022-07-05T00:08:25+05:30 IST
అల్లూరి జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ (PM Modi), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మధ్య ముచ్చట్లు అందరినీ ఆకర్షించాయి.
భీమవరం: అల్లూరి జయంత్యుత్సవాల్లో ప్రధాని మోదీ (PM Modi), మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మధ్య ముచ్చట్లు అందరినీ ఆకర్షించాయి. వేదికపై మోదీకి చిరంజీవి చిరు సత్కారం చేశారు. ఇరువురు పరస్పర వందనం చేసుకున్నారు. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. చిరునవ్వులు చిందించారు. చిరంజీవిని ప్రధాని కుశల ప్రశ్నలు వేశారు. సభ ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి జగన్ (CM Jagan), చిరంజీవి పరస్పరం పలకరించుకుని, నవ్వులు చిందిస్తూ కౌగలించుకున్నారు. ఈ సన్నివేశమూ అందరినీ ఆకట్టుకుంది.
అనంతరం సభలో చిరంజీవి మాట్లాడుతూ ‘‘అల్లూరి సీతారామరాజు తెలుగుజాతి గర్వించే స్ఫూర్తి ప్రదాత. భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ ఒక అద్భుతం. ప్రధాని మోదీ చేతుల మీదుగా అల్లూరి విగ్రహ ఆవిష్కరణ చేయడంతో ఆ మహాయోధుడికి ప్రపంచ కీర్తి లభించింది’’ అని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కిషన్రెడ్డి ఆహ్వానం మేరకు చిరు రావడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. చిరంజీవిని బీజేపీలో చేర్చుకుంటే బాగుంటుందనే ఆలోచనలో భాగంగానే ఈ ఆహ్వానం అందినట్టు సమాచారం.