చర్చల అనంతరం ఇరు దేశాల అధిపతులు ఏం చెప్పారంటే...
ABN , First Publish Date - 2020-02-25T19:53:11+05:30 IST
హైదరాబాద్ హౌస్లో మోదీ- ట్రంప్ కీలక చర్చలు జరిపారు. ఆరోగ్యం, ఆయిల్ కార్పొరేషన్లపై...
న్యూఢిల్లీ: హైదరాబాద్ హౌస్లో మోదీ- ట్రంప్ కీలక చర్చలు జరిపారు. ఆరోగ్యం, ఆయిల్ కార్పొరేషన్లపై మూడు ఒప్పందాలు జరిగాయి. ఇంధనంపై రెండు దేశాల మధ్య 20 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరింది. వాణిజ్య, పెట్టుబడుల ఒప్పందాలపై ఇరుదేశాల అధినేతలు సంతకాలు చేశారు. చర్చల అనంతరం... ట్రంప్-మోదీ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోదీ దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ సతీసమేతంగా భారత్ రావడం ఆనందం కలిగించిందని, గత ఎనిమిది నెలల్లో తానూ, ట్రంప్ 8 సార్లు సమావేశమయ్యామని గుర్తుచేశారు.
అమెరికా-భారత్ మధ్య స్నేహ బంధం పెరిగిందని, 21వ శతాబ్దానికి అమెరికా-భారత్ స్నేహం ముఖ్యమైందని చెప్పారు. అమెరికా-భారత్ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, రక్షణ, భద్రత, ఐటీ వంటి అంశాలపై చర్చలు జరిపామని మోదీ వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్నామని, డ్రగ్స్పైనా నిరంతరం పోరాడుతున్నామని ప్రధాని మోదీ మీడియా సమావేశంలో చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ పర్యటన అద్భుతంగా సాగిందని చెప్పారు. రెండు దేశాల మధ్య ఫలవంతమైన పర్యటనగా ఇది ఉంటుందని, ఈ జ్ఞాపకాలను ఎప్పటికీ మరువలేనని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య సహకారం కొనసాగుతుందని, సరిహద్దు ఉగ్రవాదంపై చర్చించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇస్లాం తీవ్రవాదం నుంచి ఇరుదేశాల ప్రజలకు భద్రత కల్పించే అంశంపై చర్చించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.
రక్షణ ఒప్పందాలపై చర్చించామని, 3 బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగిందని ట్రంప్ తెలిపారు. అపాచీ, ఎం-16 హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం జరిగిందని వివరించారు. ఉగ్రవాదం, సైబర్ నేరాలు, చొరబాట్లు ఎక్కువైపోయాయని, 5జీ వైర్లెస్ నెట్వర్క్పై చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. తాను అధ్యక్షుడిని అయ్యాక భారత్తో ఆర్థిక బంధం పెరిగిందని.. భారత్తో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.