పీఎం ఇటు.. సీఎం అటు!

ABN , First Publish Date - 2022-05-26T07:55:33+05:30 IST

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు! ప్రధానికి స్వాగతం పలకాల్సిన

పీఎం ఇటు..  సీఎం అటు!

నేడు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

అంతకుముందే బెంగళూరుకు కేసీఆర్‌

ప్రధాని వెళ్లిన తర్వాతే తిరిగి నగరానికి

ఇద్దరి మధ్య పెరుగుతున్న దూరం

ఐఎస్‌బీ ద్వి దశాబ్ది ఉత్సవాలకు ప్రధాని

రెండున్నర గంటలపాటు నగరంలో..

బేగంపేటలో సన్మానించనున్న బీజేపీ

దేవెగౌడ, కుమారస్వామితో 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం

27న రాలేగావ్‌ సిద్దికి వెళ్లే అవకాశం

హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌కు రానున్నారు! ప్రధానికి స్వాగతం పలకాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆయన ఇక్కడ అడుగు పెట్టడానికి ముందే బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు! ప్రధాని మోదీ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు చెన్నై బయలుదేరి వెళతారు. ఆ తర్వాత కొన్ని గంటలకే సీఎం కేసీఆర్‌ బెంగళూరు నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు! అంటే, ప్రధాని హైదరాబాద్‌ నుంచి వెళ్లిన తర్వాతే కేసీఆర్‌ తిరిగి హైదరాబాద్‌లో అడుగు పెట్టే అవకాశముంది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మధ్య ఇప్పటికే గ్యాప్‌ పెరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లోని సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చారు. దానికి సీఎం కేసీఆర్‌ రావద్దంటూ పీఎంవో నుంచి తమకు సందేశం వచ్చిందని ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. దీనిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఖండించారు కూడా. ఇక, సమతా మూర్తి శిలా ఫలకంపైనా కేసీఆర్‌ పేరు పెట్టలేదు. దాంతో, శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి ముఖ్యమంత్రి స్వాగతం పలకలేదు. వీడ్కోలు కూడా చెప్పలేదు. అప్పటి నుంచే పీఎం, సీఎం మధ్య పొరపొచ్చాలు ప్రారంభమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. అప్పటి నుంచి ప్రధానిని కలిసే ప్రయత్నం ముఖ్యమంత్రి చేయడం లేదు. ఇప్పుడు మరోసారి ప్రధాని నగరానికి వస్తున్నా.. పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్‌ రానున్నారు. నగరంలో రెండున్నర గంటలపాటు ఆయన పర్యటన సాగనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తదితరులు ప్రధానిని ఘనంగా సన్మానించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడేందుకు పీఎంవో నుంచి అనుమతి కోరారు. బుధవారం అర్ధరాత్రి వరకూ అనుమతి రాలేదు. కానీ, గురువారం ఉదయం వస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దాదాపు 15 నిమిషాలపాటు పార్టీ కార్యకర్తలను మోదీ కలుసుకుంటారని చెబుతున్నారు. అనంతరం 1.50 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి సెంట్రల్‌ వర్సిటీకి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఐఎ్‌సబీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3.15 గంటల వరకు ఐఎ్‌సబీ ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఐఎ స్‌బీ ఆవరణలో మొక్క నాటనున్నారు. విద్యార్థులను ఉద్దేశించి 35 నిమిషాలపాటు ప్రసంగించనున్నారు. అనంతరం, సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకుని చెన్నై బయలుదేరి వెళతారు. అక్కడ ఐదు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతోపాటు ఆరు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కాగా, ప్రధాని పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయా ప్రాంతాలకు 5 కి.మీ.ల పరిధిలో డ్రోన్లు, రిమోట్‌ కంట్రోల్‌ ఎయిర్‌క్రా్‌ఫ్టలు నిషేధించారు.

ఉదయమే బెంగళూరుకు సీఎం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం బెంగళూరు పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అవుతారు. అనంతరం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో సమావేశమవుతారు. జాతీయ రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు తదితర అంశాలపై చర్చిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వచ్చేస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఎలాంటి ప్రకటన జారీ చేయకపోయినా.. ఈనెల 18న జారీ చేసిన జాతీయ స్థాయి పర్యటన వివరాల మేరకు కేసీఆర్‌ 26న బెంగళూరు వెళ్లనున్నారని సీఎంవో వర్గాలు ధ్రువీకరించాయి. నిజానికి, అప్పట్లో విడుదల చేసిన షెడ్యూలు ప్రకారం 26న బెంగళూరు వెళ్లి.. అక్కడి నుంచే 27న మహారాష్ట్రలోని రాలేగావ్‌ సిద్దికి వెళ్లి ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలుస్తారని ప్రకటించింది. కానీ.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేస్తారని, ఇక్కడి నుంచే 27న రాలేగావ్‌ సిద్దికి వెళ్లే అవకాశాలున్నాయని సీఎంవో వర్గాలు తెలిపాయి.

Updated Date - 2022-05-26T07:55:33+05:30 IST