జిల్లాలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం
ABN , First Publish Date - 2021-04-22T05:28:44+05:30 IST
మండల కేంద్రంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయ పూజారీ దీపక్ దూబే ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణానికి వందలోపు భక్తులు హాజరయ్యారు.
ఉట్నూర్, ఏప్రిల్ 21: మండల కేంద్రంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆలయ పూజారీ దీపక్ దూబే ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణానికి వందలోపు భక్తులు హాజరయ్యారు. పార్ణంది మానిక్యం రెడ్డి దంపతులు తలంబ్రాలను తీసుక వచ్చారు. జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ కాంబ్లే నాందేవ్లు తదితరులు హాజరయ్యారు. ఉట్నూర్ సీఐ నరేష్కుమార్ ఆధ్వర్యం లో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
జైనథ్: మండలంలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీతా, రాముడి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం నిర్వహించి పట్టు వస్ర్తాలతో వేద మంత్రాల మధ్య కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోరజ్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ మహేందర్రెడ్డి, మహేందర్యాదవ్లతో పాటు ఆయా గ్రామాల భక్తులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో భక్తులు లేక ఆలయాలు వెలవెల బోయాయి. అర్చకులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, పరిమిత సంఖ్యలో భక్తులతో సీతారాముల కల్యాణం నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు ఎవరికి వారు ఆలయాలకు వెళ్లి కొవిడ్ నిబం ధనలు పాటిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డులోని రామాలయ ఆలయంలో ఆలయ కమిటీ నిర్వాహకులు కేవలం నలుగురు భక్తులతోనే పూజలు నిర్వహించారు.
భీంపూర్: మండలంలోని కరంజి(టి) రామాలయంలో బుధవారం శ్రీ సీతారాముల వారి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ జి.సాత్విక నరేందర్ దంపతులు పట్టు వస్ర్తాలను సమర్పించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సాదాసీదాగా వేడుకను నిర్వహించారు. అలాగే అంతర్గాం, అర్లి(టి)లో ఉత్సవాలు నిర్వహించారు. కరంజి(టి)లో ఉప సర్పంచ్ ఆకటి లక్ష్మిబాయి, ఎంపీటీసీ రెడ్డి దేవుబాయి, ఆలయ కమిటీ ప్రతినిధులు బక్కీ సతీష్యాదవ్రెడ్డి, విలాస్యాదవ్ తదితరులున్నారు.
బోథ్: మండలంలోని సోనాల రామాలయంలో కొవిడ్ నిబంధనలు పా టిస్తూ రాములోరి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్ సదానందం రామా లయ కమిటీ చైర్మన్ గాండ్ల రమణ, వార్డు సభ్యులు వేడుకల్లో పాల్గొన్నారు. మల్లెపూల శివ్వారెడ్డి సీతారాములకు పట్టువస్ర్తాలను సమర్పించారు.
తలమడుగు: మండలంలోని కజ్జర్ల, సుంకిడి రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని వేడుకున్నారు.
తాంసి: మండల కేంద్రంలోని రామేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని నిర్వహించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఆలయంలోకి పరిమిత సంఖ్యలో భక్తులను ఆహ్వానించారు. వేద పండితుల మంత్రాలు భక్తుల అక్షింతల మధ్యరాములోరి కల్యాణాన్ని నిర్వహించారు. సరిగ్గా 12 గంటల 10 నిమిషాలకు సీతారాముల కల్యాణం నిర్వహించారు.