ఇంటి వద్దకే కూరగాయలు

ABN , First Publish Date - 2020-03-29T10:45:05+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఇంటి వద్దకే కూరగాయలు

గ్రేటర్‌లో మొబైల్‌ రైతు బజార్లు

అందుబాటులోకి తీసుకువచ్చిన జీహెచ్‌ఎంసీ

మార్కెటింగ్‌ శాఖ సహకారంతో చర్యలు


హైదరాబాద్‌ సిటీ, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ విభాగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రజలు బయటకు రాకుండా ఇంటి ముందుకే సరుకులు తీసుకువచ్చే ప్రక్రియను ప్రారంభించాయి. ఇందులో భాగంగా మొబైల్‌ రైతు బజార్ల ద్వారా ఇంటి వద్దకే కూరగాయలు తీసుకువస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ సహకారంతో జీహెచ్‌ఎంసీ గ్రేటర్‌లో మొబైల్‌ రైతు బజార్లను ప్రారంభించింది. శనివారం 177 మొబైల్‌ రైతు బజార్ల ద్వారా 331 ప్రాంతాల్లో కూరగాయలు విక్రయించారు. ప్రస్తుతం కాలనీలు, బస్తీల్లో సంతలు జరుగుతున్నాయి.


కూరగాయలు, ఇతర వస్తువుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున బయటికి వస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిస్తోన్న నేపథ్యంలో ప్రజలు గూమిగూడటం ప్రమాదకరం. నగరంలో లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రారంభమైన దృష్ట్యా జన సమూహాలతో ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు మొబైల్‌ రైతు బజార్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నిర్దేశించిన ధరలకే కూరగాయలు విక్రయించాలని, అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  ప్రాంతాల వారీగా షెడ్యూల్‌ ఖరారు చేసి అందరికి అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. మొబైల్‌ రైతు బజార్ల వద్ద కూడా కొనుగోలుదారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

Updated Date - 2020-03-29T10:45:05+05:30 IST