ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 24 నామినేషన్లు

ABN , First Publish Date - 2021-02-24T05:46:18+05:30 IST

కృష్ణా - గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 24 నామినేషన్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేస్తున్న బొడ్డు నాగేశ్వరరావు, గాదె వెంకటేశ్వర్లు తదితరులు

నేడు గుంటూరు కలెక్టరేట్‌లో పరిశీలన

గుంటూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా - గుంటూరు జిల్లా ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గానికి నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. చివరి రోజైన మంగళవారం 11 మంది అభ్యర్థులు తమ అనుచరులతో ర్యాలీగా గుంటూరు కలెక్టరేట్‌ వద్దకు వచ్చి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కొందరు అభ్యర్థులు ముందుజాగ్రత్తగా రెండు, మూడు సెట్లు వేయడంతో మొత్తం నామినేషన్లు దాఖలైనట్లు అయింది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన దృష్ట్యా ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం గుంటూరు కలెక్టరేట్‌లోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్‌ అధికారి వివేక్‌యాదవ్‌ సమక్షంలో ఈ ప్రక్రియ ప్రారంభమౌతుంది. అభ్యర్థులు/వారి ప్రతినిధులు నామినేషన్ల పరిశీలనకు హాజరు కావొచ్చని అధికారవర్గాలు తెలిపాయి. 

చివరి రోజున యూటీఎఫ్‌, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల మద్దతుతో విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు నామినేషన్‌ వేశారు. ఆయన తొలుత స్థానిక విజ్ఞాన మందిరంలో ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నాగేశ్వరరావును గెలిపించాలని, పీడీఎఫ్‌ ఎమ్మెల్సీల గెలుపు ప్రజాంతత్ర ఉద్యమాల గెలుపు అని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌(1938) నాయకులు వెంకటేశ్వరరావు, కైలాస్‌నాథ్‌, బాబురెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు వచ్చి మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆయన వెంట గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు వచ్చారు. జనసేన పార్టీ మద్దతుతో గుంటూరుకి చెందిన గాదె వెంకటేశ్వరరావు కూడా నామినేషన్‌ వేశారు. ఆయన వెంట జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, కల్యాణం శివ శ్రీనివాసరావు హాజరయ్యారు. టీడీపీ మద్దతుతో సిట్టింగ్‌ ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ మంగళవారం మరో రెండు సెట్ల నామినేషన్లు వేశారు. నరసరావుపేటకు చెందిన డాక్టర్‌ రామకోటయ్య, చిలకలూరిపేటకు చెందిన చెన్నకేశవులు రాంబాబు, ఎస్‌టీయూ ఏపీ మద్దతుతో   పీవీ మల్లికార్జునరావు రెండు సెట్లు, కృష్ణా జిల్లా పెడనకు చెందిన బట్టు శాంప్రసాద్‌, కర్నూలు జిల్లా ఆత్మకూరుకు చెందిన భైరీ ఓంకారయ్య, మచిలీపట్నానికి చెందిన ఎం కమలాకరరావు రెండు సెట్లు, గురజాలకు చెందిన కనకం శ్రీనివాసరావు, కాకుమానుకు చెందిన యర్రాకుల తులసీరాం నామినేషన్లు దాఖలు చేశారు. 

 

Updated Date - 2021-02-24T05:46:18+05:30 IST