పౌరగ్రంథాలయాల అభివృద్ధికి కృషిచేయాలి
ABN , First Publish Date - 2021-07-27T05:25:11+05:30 IST
మున్సిపాల్టీలు సెస్ కింద వసూలు చేసిన రూ.350కోట్లు పౌర గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు.
ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
గుంటూరు (విద్య), జూలై 26: మున్సిపాల్టీలు సెస్ కింద వసూలు చేసిన రూ.350కోట్లు పౌర గ్రంథాలయాల అభివృద్ధికి వెచ్చించాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు కోరారు. పౌర గ్రంథాలయాల శాఖ సంచాలకులుగా నియమితులైన ఎంఆర్ ప్రసన్నకుమార్ను లక్ష్మణరావు, ఏపీఆర్ఈఐటీఏ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ పీవీ మల్లేశ్వర్ తదితరులు సోమవారం సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ గుంటూరులోని ప్రాంతీయ గ్రంథాలయం, రాష్ట్రకేంద్ర గ్రంథాలయాలను ఆధునీకరించి నిరుద్యోగ యువతకు, పౌరులకు అందుబాటులోని తీసుకురావాలని సూచించారు. నూతన పుస్తకాలు కొనుగోలు చేసి నిరుద్యోగ యువతకు అందించాలని కోరారు.
గ్రంథాలయ వ్యవస్థపై నిర్లక్ష్యం తగదు
విజ్ఞానకేంద్రాలుగా ఉన్న గ్రంథాలయాలను అభివృద్ధి చేయాలని, వాటిని నిర్లక్ష్యం చేయడం తగదని గ్రంథాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కోన దేవదాస్ పేర్కొన్నారు. ఈమేరకు పౌరగ్రంథాలయాల సంచాలకులు ఎంఆర్ ప్రసన్నకుమార్ను కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. నూతనచైర్మన్ల నియామకాన్ని స్వాగతిస్తున్నామని, దీనివల్ల గ్రంథాలయాల పాలన మరింత పారదర్శకంగా సాగుతుందన్నారు.