ఆ మాటను వాపసు తీసుకుంటున్నా
ABN , First Publish Date - 2022-03-22T16:50:24+05:30 IST
కోయంబత్తూర్ నగర ప్రజలను నమ్మలేమనే తన మాటను వాపసు తీసుకుంటున్నట్లు డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉదయనిధి తెలిపారు.
కోవైలో ఉదయనిధి
పెరంబూర్, మార్చి 21: కోయంబత్తూర్ నగర ప్రజలను నమ్మలేమనే తన మాటను వాపసు తీసుకుంటున్నట్లు డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉదయనిధి తెలిపారు. ఇటీవల ముగిసిన పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉదయనిధి, కోవై ప్రజలను నమ్మలేమని, గత శాసనసభ ఎన్నికల్లో డీఎంకేకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో, కోవై డీఎంకే ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సంక్షేమ సహాయాల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడుతూ, కోవై ప్రజలను నమ్మలేమని తన వ్యాఖ్యను వాపసు తీసుకుంటున్నామన్నారు. పురపాలక ఎన్నికల్లో కోవై కార్పొరేషన్లోని 100 వార్డుల్లో డీఎంకే కూటమికి 96 సీట్లు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొమ్మిది నెలల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అర్ధమవుతోందన్నారు. కోవై నగరాభివృద్ధికి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించినట్లు, ఐటీ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు ఉదయనిధి తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సెంథిల్ బాలాజి సహా ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.