Rahul Gandhiపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్
ABN , First Publish Date - 2022-05-08T21:22:14+05:30 IST
Rahul Gandhiపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్
హనుమకొండ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణలో రెండ్రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ (TRS Party)పై రాహుల్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇందుకు స్పందించిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్ల వర్షం కురిపించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్గా మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా స్పందిస్తూ కౌంటర్ ఎటాక్ చేశారు. ఆదివారం నాడు హనుమకొండలో మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. టీఆర్ఎస్ నేతలు ఎలక్షన్ టూరిస్టులని.. ఎన్నికలప్పుడే ప్రజల్లో తిరుగుతారని విమర్శలు గుప్పించారు.
కేటీఆర్.. రాహుల్ ఎక్కడా... మీరెక్కడా..!?
‘ఏంటి.. రాహుల్ గాంధీ డమ్మీనా..?. డమ్మీలెవరో, డమ్మీ మంత్రులెవరో అందరికీ తెలుసు. తెలంగాణలో ఒక్క మంత్రికైనా స్వేచ్ఛ ఉందా..?. గాడ్సేలు టీఆర్ఎస్లోనే ఉన్నారు. సమస్యలు తెలుసుకుని మాట్లాడితే స్క్రిప్టు అంటారా..?. టీఆర్ఎస్, బీజేపీవి క్లయిమ్ గేమ్ డ్రామాలు. రాహుల్ గాంధీ రాకను చూసి టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాహుల్ పర్యటనపై ఎందుకు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prasanth Kishore) ఇచ్చిన రిపోర్ట్తో టీఆర్ఎస్ నేతల్లో భయం మొదలైంది. రాహుల్కు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకుని త్యాగం చేశారు. రాజులా ఉండే జీవితాన్ని వదులుకున్నారు. అసలు రాహుల్ ఎక్కడా... మీరెక్కడా..?. మీరు ముఖ్యమంత్రి కాకుండానే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నారు. రాహుల్కు ఎడ్లు తెల్వదు వడ్లు తెల్వదనడం దుర్మార్గం. టీఆర్ఎస్ను విమర్శించిన బీజేపీని కేటీఆర్ ఎందుకు విమర్శించలేదు. ఆంధ్రానాయకుల పాలనలో కూడా ఇలాంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే. రాజకీయ జిమ్మిక్కులు మానుకోండి. రాహుల్పై టీఆర్ఎస్ విమర్శలు హాస్యాస్పదం, అర్థరహితం’ అని కేటీఆర్, టీఆర్ఎస్ నేతలపై సీతక్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు.