హత్య గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన MLA రాజాసింగ్
ABN , First Publish Date - 2022-05-08T23:20:04+05:30 IST
హత్య గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన MLA రాజాసింగ్
హైదరాబాద్ (HYDERABAD) సరూర్నగర్లో హత్య గురైన నాగరాజు కుటుంబాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ కేసులో ఇద్దరే నిందితులున్నారని పోలీసులు అంటున్నారని విమర్శించారు. కానీ నాగరాజు భార్య అశ్రిన్ నలుగురు నిందితులు ఉన్నారని ఆమె చెప్పిందని రాజాసింగ్ తెలిపారు. హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ హామీ ఇచ్చారు. పరువు హత్యలకు ఎవరైనా పాల్పడితే కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు.
దళిత యువకుడు నాగరాజును హత్య చేసినవారికి త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ విజయ్ సాంప్లా అన్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టుతో విచారణ చేపట్టి నిందితులకు అట్రాసిటీ చట్టం ప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. భవిష్యత్లో ఇలాంటివి చోటుచేసుకోకుండా నిందితులను శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మతాంతర ప్రేమ వివాహం చేసుకుని.. గత బుధవారం హైదరాబాద్లో దారుణ హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని శనివారం వికారాబాద్ జిల్లా మర్పల్లిలో విజయ్ సాంప్లా పరామర్శించారు. నాగరాజు భార్య ఆశ్రీన్ సుల్తానా, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఇలాంటి ఘటనల్లో బాధిత కుటుంబానికి అందజేసే రూ.8.25 లక్షల పరిహారంలో సగం మొత్తం వెంటనే వచ్చేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అంతేకాక నెలకు రూ.5 వేల పింఛన్తో పాటు డబుల్ బెడ్రూం ఇల్లు, మూడు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయించేలా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు. ఆశ్రీన్ సుల్తానాకు ఉద్యోగం, కుటుంబంలోని ఇతరులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాగరాజు హత్య కేసుపై సీఎస్, డీజీపీతో సమావేశమవుతున్నట్లు తెలిపారు. కాగా, సాంప్లా వెంట మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంపీ వివేవ్ వెంకట్స్వామి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి ఉన్నారు. నాగరాజు కుటుంబానికి చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు.