ఇసుక కొరతపై ఎమ్మెల్యే వినూత్నరీతిలో నిరసన
ABN , First Publish Date - 2020-06-04T23:28:53+05:30 IST
పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు ఇసుక కొరతపై వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు.
ప.గో. జిల్లా: పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు ఇసుక కొరతపై వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేశారు. పాలకొల్లులోని తన క్యాంప్ కార్యాలయం నుంచి తాహసీల్దార్ ఆఫీసు వరకు తోపుడుబండిపై ఇసుక ప్యాకెట్లు విక్రయిస్తూ పాదయాత్ర చేశారు. భారతీ ఇసుక పేరుతో ప్యాకెట్లు రూపొందించిన ఆయన.. దానికి జే ట్యాక్స్ అదనం అంటూ నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు బంగారానికి ఇసుకను అమ్ముతూ రాష్ట్రంలో ఇసుక కొరత ఏ స్థాయిలో ఉందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. రాయలవారి హయాంలో రతనాలను రాసులుగా పోసి అమ్మితే జగన్ పాలనలో ఇసుకే రత్నాలుగా అమ్ముతున్నారని రామానాయుడు అన్నారు. మార్కెట్లో బంగారం దొరుకుతుంది.. కానీ ఇసుక దొరకడంలేదని అన్నారు. రాష్ట్రంలో జే ట్యాక్స్తో కూడిన భారతీ ఇసుక మాత్రమే కనిపిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు. వైసీపీ నేతల ఇంట్లో మాత్రం ఇసుక పంట పండుతోందని రామానాయుడు ఆరోపించారు.