తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో.. నేడు (మే 28) నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Ramarao) శతజయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) చేతుల మీదుగా.. హైదరాబాద్ (Hyderabad), ఫిల్మ్ నగర్ (Film Nagar)లో ఎన్టీఆర్ కృష్ణావతార కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి నందమూరి ఫ్యామిలీ (Nandamuri Family) సభ్యులే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
విగ్రహావిష్కరణ అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్గారు తెలుగు జాతి గర్వపడేలా చేసిన వ్యక్తి. నాయకుడిగా నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. ఎన్టీఆర్ వల్లే ఎంతోమంది నాయకులుగా ఎదిగారు. వారి విగ్రహాన్ని ఆవిష్కరించటంతో నా జన్మ ధన్యమైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు నిర్వహిస్తున్నారు. ఫిల్మ్ నగర్లోఎన్టీఆర్ మార్గ్ పేరు వచ్చేలా, సీఎం కేసీఆర్తో మాట్లాడి కృషి చేస్తాను. హైదరాబాద్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్గారే’’ అని అన్నారు.
పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) మాట్లాడుతూ.. ‘‘అన్నగారికి వందవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఎన్టీఆర్ మనతోనే ఉన్నారు, ఉంటారు. ఎన్టీఆర్ అనే మూడక్షరాల పేరే త్రిమూర్తుల స్వరూపం. శివుడిలా పేదవారి ఉన్నతికి ఎన్నో పథకాలను సృష్టించారు. ఇక ఆయనే ఒక విష్ణుమూర్తి స్వరూపం. వారి మనస్తత్వంపై నేనో పుస్తకాన్ని రచించనున్నాను. వారితో నేను చేసిన 16 ఏళ్ల ప్రయాణం, చెప్పిన జీవిత సత్యాలతో పుస్తకముంటుంది. మమ్మల్ని రచయితలుగా ఎన్టీఆర్ ఎంతో పోత్సహించారు. పరుచూరి బ్రదర్స్ అని మాకు ఎన్టీఆరే పేరు పెట్టారు..’’ అని తెలిపారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. మాగంటి గోపీనాథ్, పరుచూరి గోపాలకృష్ణ.. ఎన్టీఆర్కు సన్నిహితులు. ఎన్టీఆర్గారిని కలిసే అదృష్టం నాకు కొన్నిసార్లు లభించింది. ఫిల్మ్ నగర్ రోడ్డుకే కాదు ఫిల్మ్ నగర్కే ఎన్టీఆర్ పేరు పెట్టాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ప్రసన్న కుమార్ (Prasanna Kumar) మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్గారి వల్లే ఫిల్మ్ నగర్ డెవలప్ అయింది. లోకల్ టాలెంట్ను ఎన్టీఆర్ ఎంకరేజ్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు మూలకర్త ఎన్టీఆర్. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ మార్క్ చూపించారు. ఏ రాష్ట్రంలో చూసినా ఎన్టీఆర్ పథకాలే. గజం స్థలం కూడా ఉచితంగా తీసుకోకుండా సినీ పరిశ్రమకి కృషి చేశారు. వారి జయంతి నాడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం అభినందనీయం’’ అని అన్నారు.
నందమూరి విష్ణురూప (Nandamuri VishnuRupa) మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ శత జయంతి ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది తెలుగు వారికి పండుగ. రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ మాత్రమే. విగ్రహ శిల్పి రాజు (Raju) గారికి మా కుటుంబం తరపున ధన్యవాదాలు’’ అని అన్నారు.
సి కల్యాణ్ (C Kalyan) మాట్లాడుతూ.. నందమూరి మోహనకృష్ణ, ప్రసన్న కుమార్ల వల్లే ఫిల్మ్ నగర్లో ఈ విగ్రహం ఏర్పాటయింది. ఫిల్మ్ నగర్ రోడ్డు ఎన్టీఆర్ మార్గ్ కావాలన్నది మా కోరిక. మాగంటి గోపీనాథ్గారు ఎన్టీఆర్కి ప్రియ శిష్యుడు. కేసిఆర్ (KCR)గారికి కూడా ఎన్టీఆర్ అంటే అభిమానం. వారు తలుచుకుంటే ఎన్టీఆర్ మార్గ్ రావటం తధ్యం. గోపీనాథ్గారు కేసిఆర్గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లాలని కోరుతున్నామని అన్నారు.