తొక్క.. తోలూ అంటూ మాట్లాడుతున్నారు..

ABN , First Publish Date - 2022-06-25T05:39:17+05:30 IST

తొక్క.. తోలూ అంటూ మాట్లాడుతున్నారు..

తొక్క.. తోలూ అంటూ మాట్లాడుతున్నారు..

- అలాంటి వారు నన్నేమీ చేయలేరు

- ఓ సోదరుడు ప్రభుత్వంలో ఉండీ ఓడించేందుకు యత్నించారు

- సొంతపార్టీ నాయకులపై ఎమ్మెల్యే కృష్ణదాస్‌ విమర్శలు

నరసన్నపేట, జూన్‌ 24: నరసన్నపేటలో శుక్రవారం జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ చేసి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. సొంత పార్టీ నాయకులపైనే ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని, ఎంతమంది ఏకమైనా నన్ను ఓడించలేరని అన్నారు. స్థాయికి మించి పదవులు ఆశించవద్దన్నారు. ‘పార్టీలో కొందరు నేలవిడిచి సాము చేస్తున్నారు. అలా చేస్తే కిందకు పడిపోవడం ఖాయం. నేనేమీ అమాయకుడ్ని కాదు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఎంతమంది ఏకమైనా నేనే ఎమ్మెల్యేని. నరసన్నపేట ఉప ఎన్నికల్లో ఒక సోదరుడు నాపై పోటీచేయగా.. మరో సోదరుడు ప్రభుత్వంలో ఉండి ఓడించేందుకు నాయకత్వం వహించారు. అయినా నేనే గెలిచా. తొక్క.. తోలూ అంటూ కొంతమంది పార్టీ నాయకులు ఏవేవో మాట్లాడుతున్నారు. సామాజిక మాద్యమాల్లో పోస్టింగ్‌లు పెడు తున్నారు. అలాంటి వారు నన్నేమీ చేయలేరు’ అని అన్నారు. అంత కుముందు విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ స్థానిక నాయకులకు గౌరవం ఉంటుందని, పార్టీ అభ్యున్నత కష్టపడి పనిచేయాలని అన్నారు. 


ఎంపీపీలు, జడ్పీటీసీలు డుమ్మా

ప్లీనరీకి సారవకోట ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, జలుమూరు జడ్పీటీసీ మెండ విజయశాంతితో పాటు 2009 ఉప ఎన్నికల్లో ధర్మాన రామదాస్‌కు అనుకూలంగా పనిచేసిన పలువురు నాయకులు హాజరు కాలేదు..

Updated Date - 2022-06-25T05:39:17+05:30 IST