రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

ABN , First Publish Date - 2020-07-05T11:31:16+05:30 IST

జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు.

రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

జడ్చర్ల/మిడ్జిల్‌/రాజాపూర్‌, జూలై 4: జడ్చర్ల మండలం గంగాపురం గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే జడ్చర్ల పట్టణంలోని గాంధీట్రస్ట్‌ స్థలంలోని టీఆర్‌ఎస్‌కేవీ కార్యాలయంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. అదే ప్రాంగణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన బాదేపల్లి షౌకత్‌అలీకి రూ.లక్ష, ఆలూరు శేఖర్‌రెడ్డికి రూ.1.50 లక్షలు, కిష్టారం గోపాల్‌రెడ్డికి రూ.1.50 లక్షలు అందచేశారు. హేమాజీపూర్‌ శివకుమార్‌కు రూ.3ల క్షల రూపాయల ఎల్‌ఓసీని అందజేశారు. అలాగే మిడ్జిల్‌ మండలంలోని రాణిపేట, మిడ్జిల్‌ గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన, వల్లభురావుపల్లి గ్రామంలోని పాలశీతలీకరణ కేంద్రం భవనాన్ని, మండల కేంద్రంలోని పెట్రోల్‌ పంపును ప్రారంభించారు.


రాజాపూర్‌ మండల పరిధిలోని ఈద్గాన్‌పల్లి శివారులో రైతు వేదిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిధిలోని మల్లేపల్లిలో మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, బాదేపల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పిట్టల మురళి, జడ్పీటీసీ శశిరేఖాబాలు, ఎంపీపీ కాంతమ్మ, సింగిల్‌విండో చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ బంధు మండల కో- ఆర్డినేటర్‌ శ్యామల్‌రెడ్డి పాల్గొన్నారు.


అంజయ్య కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ జడ్చర్ల శాఖ అధ్యక్షుడు విఠాల అంజయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే సి. లక్ష్మారెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజయ్య మృతి ఉద్యోగులకు తీరని లోటన్నారు. అలాగే జడ్చర్ల పెన్షనర్స్‌ ఆధ్వర్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Updated Date - 2020-07-05T11:31:16+05:30 IST