ఎమ్మెల్యే ఇసుక బుక్ చేయలేదు
ABN , First Publish Date - 2020-06-07T08:38:58+05:30 IST
ఇసుక అందుబాటులో లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఆన్లైన్లో బుక్ చేసి మూడు రోజులైనా ఇసుక రాలేదని
- వర్క్ ఆర్డర్ లేకుండా ఎలా ఇస్తాం?
- ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యాఖ్యలకు కలెక్టర్ కౌంటర్
కాకినాడ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ఇసుక అందుబాటులో లేదంటూ వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. తాను ఆన్లైన్లో బుక్ చేసి మూడు రోజులైనా ఇసుక రాలేదని శుక్రవారం ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఎమ్మెల్యే అసలు ఇసుకే బుక్ చేయలేదు. కొత్తపేట వంతెన రోడ్డు నిర్మాణానికి 4481 మెట్రిక్ టన్నుల ఇసుక కావాలని కోరారు. కానీ, ఈ పనికి ప్రభుత్వం నుంచి ఎటువంటి వర్క్ ఆర్డర్ రాలేదు. కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ లేదు. అటువంటప్పుడు ఇసుక ఎలా ఇస్తాం?’’ అని కలెక్టర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యే సిఫారసు చేసినంత మాత్రాన ఇసుక ఇవ్వలేమని స్పష్టం చేశారు. రెండు వాహనాల్లో గోదావరి నుంచి ఇసుక తరలించడానికి ఎమ్మెల్యే ఈనెల 2న తనకు లేఖ రాశారని, 6న ఇందుకు అనుమతి కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.