దళిత పథకాలు రద్దు చేస్తుంటే మీరేం చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-05-20T06:15:39+05:30 IST

‘గడప గడప’కు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్లిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన అధికారులతో కలిసి చిరతపూడిలోని చిట్టిచెరువుగట్టు రాజీవ్‌కాలనీని సందర్శించారు.

దళిత పథకాలు రద్దు చేస్తుంటే మీరేం చేస్తున్నారు
ఎమ్మెల్యే చిట్టిబాబును నిలదీస్తున్న మహిళ

  • చిరతపూడిలో ఎమ్మెల్యే చిట్టిబాబును నిలదీసిన మహిళ, యువకులు
  • సమాధానం చెప్పకుండా వారిపై మండిపాటు

అంబాజీపేట, మే 19: ‘గడప గడప’కు మన ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళ్లిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఆయన అధికారులతో కలిసి చిరతపూడిలోని చిట్టిచెరువుగట్టు రాజీవ్‌కాలనీని సందర్శించారు. దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథ కాలను జగన్‌ సీఎం అయినప్పటి నుంచి రద్దు చేశారని.. వీటిపై తమకు సమాధానం చెప్పాలని దళిత మహిళ కొంబత్తుల సునీత, యువకులు కొంబత్తుల శ్రీనివాస్‌,గోవిందరాజు ఎమ్మెల్యే చిట్టిబాబును నిలదీశారు. రాజ్యాంగబద్ధంగా దళిత ఎమ్మెల్యేగా ఎన్నికైన మీరు పథకాలను రద్దుచేస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అయితే ఎమ్మెల్యే సమాధానం చెప్పకుండా నిలదీసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కాలనీకి మూడేళ్లుగా రోడ్డు, ఇతర మౌలిక సదుపాయాలు లేవని ఆరోపించగా... పార్టీకి పనిచేయని వారికి ఎటువంటి పథకాలూ రావని మండిపడ్డారు. దీంతో మహిళలు, యువకులు అదేస్థాయిలో పథకాల రద్దుకు సంబఽంధించి 27 ప్రశ్నలను సంధించడంతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరై అక్కడి నుంచి వెనుదిరిగారు. దీంతో వైసీపీ నాయకులు, యువకుల మధ్య వాగ్వివాదం జరిగింది. సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రజాప్రతినిధులు దురుసుగా మాట్లాడడంతో ఆ యువకులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉన్న ఎస్‌ఐ ఎ.చైతన్యకుమార్‌ ఆ యువకులను వారించారు. ఉదయం కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఎమ్మెల్యేకు అడుగడుగునా సమస్యలు ఎదురయ్యాయి. ప్రభుత్వ రికార్డులో 10 ఎకరాల భూమి ఉన్నట్టు నమోదు కావడంతో తన కుటుంబానికి సంక్షేమ పథకాలు రావట్లేదని చిరతపూడి కొంబత్తులవారిపేటకు చెందిన కొంబత్తుల ధనలక్ష్మి ఎమ్మెల్యే ముందు ఏకరవు పెట్టింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం నమోదైన 10 ఎకరాల భూమిని తమకు ఇప్పించాలని, ఇప్పటివరకు తాను కోల్పోయిన అన్ని సంక్షేమ పథకాలను ఇప్పించాలని కోరింది. ఈ సమస్యను పరిష్కరించి ఆమెకు న్యాయం చేయాలని వీఆర్వోకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ దొమ్మేటి వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ బూడిద వరలక్ష్మి, వైస్‌ ఎంపీపీ నేతల నాగరాజు, వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు, స్థానికులు కడలి సత్యనారాయణ, దొమ్మేటి సత్యమోహన్‌, ఏవో విజయకుమార్‌, పంచాయతీ కార్యదర్శి జీజీవీకే కుమార్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T06:15:39+05:30 IST