చెరువుల పరిరక్షణ బాధ్యత అందరిది
ABN , First Publish Date - 2021-03-04T05:29:19+05:30 IST
చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి గుర్తు చేశారు.
- ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఎల్బీనగర్, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి గుర్తు చేశారు. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని సరూర్నగర్ చెరువు చుట్టూ నూతనంగా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను లింగోజిగూడ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివా్సరావుతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరూర్నగర్ చెరువు నివాసాల నడుమ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. కానీ దురదృష్టవశాత్తు చెరువు మొత్తం మురుగునీటితో నిండిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చెరువులో దాదాపు 5అడుగుల మేర సిల్ట్ పేరుకు పోయిందన్నారు. ఎవరైనా పొరపాటున చెరువులోకి దిగితే ఊబిలో కూరుకుపోయినట్లు సిల్ట్లో కూరుకుపోతారన్నారు. చెరువు మొత్తం కాలుష్యమవడంతో దుర్గంధ పూరితమై పరిసరాలలో కూర్చునేందుకు ఆస్కారం లేకుండా తయారైందన్నారు. మురుగుకుతోడు చెరువులో ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలు వేసి నింపేస్తున్నారన్నారు. చెరువుల సంరక్షణ బాధ్యత ప్రభుత్వంపై వేయకుండా ప్రతీ పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకుని తమ వంతు కృషి చేయాలన్నారు. గతంలో ఇక్కడ నిర్మించిన ఎస్టీపీ స్థాయి సరిపోకపోవడం వల్ల మురుగంతా చెరువులోకి చేరుతుందన్నారు. భవిష్యతులో మురుగు వచ్చి చెరువులో కలవకుండా ప్రత్యేక పైప్లైన్ వేసి నేరుగా మూసీలోకి తరలించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. త్వరలోనే అది కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. ప్రజలు చెరువుల పరిసరాలలో వ్యర్థాలు, ప్లాసిక్ వేయకుండా తమకు తాము కట్టడి చేసుకోవాలని సూచించారు. రాబోయే రోజుల్లో చెరువు చుట్టూ వాకింగ్ట్రాక్, సైక్లింగ్ట్రాక్తోపాటు మెష్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఫుడ్కోర్టు, పచ్చికబయళ్లు, బెంచీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాదం పంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రమే్షముదిరాజ్, మధుసాగర్, ప్రవీణ్రెడ్డి పాల్గొన్నారు.