డోసుకో టీకా!
ABN , First Publish Date - 2021-06-11T08:00:22+05:30 IST
టీకా రక్షణ సుదీర్ఘకాలం ఉండేలా చేయడానికి.. వివిధ టీకాలను కలిపి వేయడంపై భారతదేశం ఆలోచించాలన్నది దేశంలో పలువురు వైద్యనిపుణులు, శాస్త్రజ్ఞుల అభిప్రాయం...
- రెండు డోసుల్లో వేర్వేరు టీకాలపై ప్రయోగాలు
- పలుదేశాల్లో ఇప్పటికే జరుగుతున్న అధ్యయనాలు
- భారత్లోనూ ప్రయోగాలు చేయాలన్న డిమాండ్
టీకా రక్షణ సుదీర్ఘకాలం ఉండేలా చేయడానికి.. వివిధ టీకాలను కలిపి వేయడంపై భారతదేశం ఆలోచించాలన్నది దేశంలో పలువురు వైద్యనిపుణులు, శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మే నెలాఖరులోనే దీనిపై నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ ఒక ప్రకటన చేశారు. మొదటి డోసు ఒకరకం వ్యాక్సిన్ వేసి, రెండో డోసు మరో వ్యాక్సిన్ వేయడంపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయని.. భారతదేశం కూడా ఆ దిశగా ఆలోచించాలని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి మనదేశంలోనే ఉత్తరప్రదేశ్లో ఇలాగే 20 మందికి ఒక డోసు కొవిషీల్డ్, రెండో డోసు కొవాగ్జిన్ ఇచ్చారు. అయినా వారికి ఏమీ కాలేదు. అయితే, అది పొరపాటున జరిగింది. కావాలని చేసిన ప్రయోగం కాదు. అలాగే.. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్న నేపథ్యంలో యూకేలో తొలి డోసు ఆ టీకా వేసినవారికి, రెండో డోసు ఫైజర్ టీకా ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి సమస్యలూ కనిపించలేదు. మనదేశంలో మాత్రం అలాంటి ‘మిక్స్ అండ్ మ్యాచ్’ ప్రయోగాలేవీ ఇంతవరకూ జరగలేదు. ఇలా రెండు డోసుల్లో రెండు టీకాలు ఇవ్వడాన్ని హెటెరోలోగస్ ఇమ్యూనైజేషన్ అంటారు. రోగనిరోధక వ్యవస్థను మరింత ఉత్తేజితం చేయడానికి, టీకా రక్షణ కాలాన్ని మరింతగా పెంచడానికి ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటారు. ముఖ్యంగా.. ఎడినోవైర్సలాంటి వెక్టర్లను (వాహకాలను) ఆధారంగా చేసుకుని రూపొందించే కొవిషీల్డ్/స్పుత్నిక్ వంటి టీకాలు వేసినప్పుడు బూస్టర్ డోసుగా వేరే టీకా వేస్తే ఎక్కువకాలం రక్షణ లభిస్తుందని కొందరు శాస్త్రజ్ఞులు భావిస్తారు. ఎందుకంటే.. ఒకే రకమైన వైర్సను వాహకంగా చేసుకుని వేసే టీకా రెండో డోసు ప్రభావం తక్కువగా ఉంటుందన్నది వారి వాదన. అందుకే రష్యా సంస్థ తన స్పుత్నిక్ వి టీకా రెండు డోసులకూ రెండు వేర్వేరు వైర్సలను వాడుతోంది. కానీ, కొవిషీల్డ్ రెండు డోసుల్లోనూ.. చింపాంజీల్లో జలుబు కలిగించే ఎడినోవైర్సనే వినియోగిస్తున్నారు.
మ్యుటేషన్లు, వేరియంట్లపై పోరుకు..
మహమ్మారిగా మారిన వైరస్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి సోకడంతో దాంట్లో కొత్త ఉత్పరివర్తనాలు జరిగి రకరకాల వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. అప్పటికే అందుబాటులో ఉన్న టీకాల ప్రభావం కొత్త వేరియంట్లలో కొన్నిటిపై ఎక్కువ ప్రభావం చూపట్లేదు. కొన్ని రకాల టీకాలు కొన్నిరకాల స్ట్రెయిన్లపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి.. రెండు డోసుల్లో రెండు రకాల టీకాలు ఇస్తే ఎక్కువ వేరియంట్లను ఎదుర్కొనే అవకాశం ఎక్కువ ఉంటుందని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ‘‘రెండు టీకాల ద్వారా మన శరీరానికి ‘స్పైక్ ప్రొటీన్’ను ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తాం. కానీ, ఆ పనిని రెండుసార్లూ రెండు రకాల పద్ధతుల్లో చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ దాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటుంది. తద్వారా ఎక్కువ కాలం రక్షణ లభిస్తుంది’’ అని ఆక్స్ఫర్డ్ గ్రూప్ ప్రొఫెసర్ మాథ్యూ స్నేప్ వివరించారు.
టీకాల మిక్స్ అండ్ మ్యాచ్ ప్రయోగాలు ఇప్పుడు కొత్తగా చేస్తున్నవి కావు. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నవే. ఎబోలా లాంటి వైర్సలను ఎదుర్కోవడానికి రూపొందిస్తున్న వ్యాక్సిన్లపై ఈ తరహా ప్రయోగాలు జరుగుతున్నాయి. మనదేశంలో రోటావైరస్ వ్యాక్సిన్లను ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ పద్ధతిలో ప్రయోగాత్మకంగా ఇస్తున్నారు. మనదేశంలో ఈ ఏడాది చివరినాటికి హోల్విరియన్ (కొవాగ్జిన్), వైరల్ వెక్టర్ (కొవిషీల్డ్, జాన్సన్ అండ్ జాన్సన్, స్పుత్నిక్ వి), ఎంఆర్ఎన్ఏ (ఫైజర్, మోడెర్నా).. వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అంచనా. వాటన్నింటిపై రకరకాల ప్రయోగాలు చేసి చౌకైన, సమర్థమైన కాంబినేషన్ల టీకాలు ఏవో గుర్తిస్తే.. పేద, మధ్యతరగతి దేశాలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. - సెంట్రల్ డెస్క్