మిథాలీ ప్రపంచ రికార్డ్.. సచిన్ సరసన చోటు
ABN , First Publish Date - 2022-03-07T00:54:55+05:30 IST
ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భాగంగా నేడు (ఆదివారం) పాకిస్థాత్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్వితీయ విజయం
మౌంట్ మాంగనూయి: ఐసీసీ మహిళల ప్రపంచకప్లో భాగంగా నేడు (ఆదివారం) పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు అద్వితీయ విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థిపై 107 పరుగుల తేడాతో విజయం సాధించి తన ప్రపంచకప్ ప్రస్థానాన్ని ఆరంభించింది.
ఈ మ్యాచ్తో మహిళా జట్టు సారథి మిథాలీ రాజ్ అత్యంత అరుదైన ప్రపంచ రికార్డు సాధించింది. ఆరు ప్రపంచకప్లలో ఆడిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డులకెక్కింది. 2000వ సంవత్సరంలో తొలి ప్రపంచకప్ ఆడిన మిథాలీ ఆ తర్వాత వరుసగా 2005, 2009, 2013, 2017 ప్రపంచకప్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించింది.
తాజాగా ఇప్పుడు న్యూజిలాండ్లో జరుగుతున్న ప్రపంచకప్లో భారత జట్టుకు సారథ్యం వహిస్తోంది. ఫలితంగా ఆరు ప్రపంచకప్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా అత్యంత అరుదైన రికార్డును తన సొంతం చేసుకుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డెబ్బీ హాక్లీ, ఇంగ్లండ్ క్రికెటర్ చార్లొటే ఎడ్వర్డ్స్ రికార్డులను బద్దలుగొట్టింది.
అంతేకాదు, ఆరు ప్రపంచకప్లు ఆడిన రెండో ఇండియన్గానూ రికార్డు సృష్టించింది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా ఆరు ప్రపంచకప్లలో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో సచిన్ ఒక్కడే ఉండగా, మిథాలీ ఇప్పుడు అతడి సరసన చేరింది.
సచిన్ 1992, 1996, 1999, 2003, 2007, 2011 ప్రపంచకప్లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఓవరాల్గా ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ మన మిథాలీ కావడం మరో విశేషం. పాకిస్థాన్కు చెందిన జావెద్ మియాందాద్ కూడా ఆరు వన్డే ప్రపంచకప్లు ఆడాడు.