ప్రాజెక్టు మట్టి పక్కదారి?
ABN , First Publish Date - 2021-05-16T05:48:25+05:30 IST
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వస్తున్న మట్టిని మూలలంకలో డంపింగ్ చేయాల్సి ఉండగా కొంత మంది అధికార పార్టీ నాయకుల అండదండలతో మట్టి దోపిడికి పాల్పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిల్వ చేయాల్సిన మట్టి అక్రమార్కుల పరం
చర్యలు తీసుకుంటామన్న తహసీల్దార్
పోలవరం, మే 15: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వస్తున్న మట్టిని మూలలంకలో డంపింగ్ చేయాల్సి ఉండగా కొంత మంది అధికార పార్టీ నాయకుల అండదండలతో మట్టి దోపిడికి పాల్పడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో తొలగించిన మట్టిని మూలలంక వద్ద ఇరిగేషన్ అధికారులు సేకరించిన భూముల్లో డంపింగ్ చేయాల్సి ఉంది. ఆ మట్టినే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాంలో వాడాల్సి ఉండగా 902 హిల్ ప్రాంతంలో స్పిల్ ఛానల్ నుంచి తరలిస్తున్న మట్టిని కొంత మంది అక్రమార్కులు ప్రయివేటు వాహనాల్లో పోలవరం తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఉన్న పంట పొలాల్లో డంపింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టు మట్టిని అమ్ముకుంటున్న అక్రమార్కులపై పోలవరం తహసీల్దార్ని వివరణ కోరగా మట్టి తరలింపు పై తామేమీ అనుమతులు ఇవ్వలేదని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంపై జలవనరుల శాఖ డివిజన్ 3 డీఈని వివరణ కోరగా మట్టి తరలింపు విషయం తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు. మట్టి తరలింపు విషయంలో అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.