ఆసుపత్రి నిర్వాకం: వేరే కుటుంబానికి కోవిడ్-19 బాధితుని మృతదేహం అప్పగింత!
ABN , First Publish Date - 2020-07-08T11:38:51+05:30 IST
మహారాష్ట్రలోని ఠాణె నగరంలో కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన కోవిడ్ -19 బాధితుని గురించిన సమాచారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ బాధితుని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది మరొక కుటుంబానికి...
ఠాణె: మహారాష్ట్రలోని ఠాణె నగరంలో కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన కోవిడ్ -19 బాధితుని గురించిన సమాచారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆ బాధితుని మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది మరొక కుటుంబానికి అప్పగించినట్లు తేలింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఆసుపత్రి నుంచి 72 ఏళ్ల కరోనా బాధితుడు అదృశ్యమైన నేపధ్యంలో అతని కుటుంబీకులు కపూర్బావాడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఆ బాధితుణ్ణి అతని కుటుంబీకులు జూన్ 29 న గ్లోబల్ హబ్ కోవిడ్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అతని మృతదేహాన్ని రెండు రోజుల క్రితం కోప్రిలోని ఒక కుటుంబానికి ఆసుపత్రి సిబ్బంది అప్పగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో వారు ఆ మృతదేహానికి వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఇద్దరు బాధితుల చికిత్సకు సంబంధించిన రిపోర్టులు తారుమారైన కారణంగా ఈ గందరగోళం చోటుచేసుకుంది.