అమెరికాలో మరో గవర్నర్కు కరోనా పాజిటివ్!
ABN , First Publish Date - 2020-09-25T01:06:29+05:30 IST
అమెరికాలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమె
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రానికి చెందిన గవర్నర్ మైక్ పార్సన్ కొవిడ్ బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో తన భార్య.. తెరెసా పార్సన్కు కూడా పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం బాగానే ఉందని, ఎటువంటి లక్షణాలు లేవని చెప్పారు. కొవిడ్ నిబంధనల ప్రకారం.. హోం క్వారెంటైన్లో ఉన్నట్లు తెలిపారు. కాగా.. తాను మరోసారి కొవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకున్నట్లు చెప్పారు. వాటికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. కాగా.. అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న క్రమంలో ఇతర రాష్ట్ర గవర్నర్లు.. తమ రాష్ట్రాల్లో మాస్క్ తప్పనిసరి నిబంధనను కఠినంగా అమలు చేశారు. ఈయన మాత్రం మిస్సోరీ రాష్ట్రంలో ఆ నిబంధనను అమలు చేయడానికి నిరాకరించారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా బారినపడిన మూడవ గవర్నర్గా మైక్ పార్సన్ నిలిచారు. అంతకుముందు ఓక్లహోమా, ఒహియో రాష్ట్ర గవర్నర్లు కరోనా బారినపడినపడ్డ విషయం తెలిసిందే. కాగా.. అమెరికా ఇప్పటి వరకు సుమారు 71లక్షల మంది కరోనా బారినపడగా.. మరణాల సంఖ్య 2లక్షలు దాటింది.