గంగమ్మ ఆలయంవద్ద తప్పిపోయిన బాలుడు

ABN , First Publish Date - 2022-05-18T08:11:20+05:30 IST

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద సోమవారం రాత్రి నాలుగేళ్ల బాలుడు తప్పిపోయాడు.

గంగమ్మ ఆలయంవద్ద తప్పిపోయిన బాలుడు
తప్పిపోయిన రంగస్వామి

తిరుపతి(నేరవిభాగం), మే 17: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం వద్ద సోమవారం రాత్రి నాలుగేళ్ల బాలుడు తప్పిపోయాడు. ఈస్ట్‌ ఎస్‌ఐ ప్రకా్‌షకుమార్‌, బాలుడి తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రామాంజనేయపురానికి చెందిన పరశురాం, రేణుక దంపతులు రాగి ఉంగరాలు, తదితరాలను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. జాతర సందర్భంగా గంగమ్మ ఆలయం వద్ద వ్యాపారం చేయడానికి తమ కుమారుడు రంగస్వామి (4)ని తీసుకుని ఏడ్రోజుల కిందట తిరుపతికి వచ్చారు. సోమవారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో వర్షం పడటంతో ఆలయ సమీపంలోని వెటర్నరీ వైద్యశాల పక్కనే మూసిఉన్న ఓ దుకాణం వద్ద ముగ్గురూ తలదాచుకున్నారు. వర్షం తగ్గాక భోజనం పార్శిల్‌ తీసుకురావడానికి పరశురాం గ్రూప్‌ థియేటర్స్‌ వద్దకెళ్లాడు. కొంతసేపటికి పక్కనే ఉండాల్సిన బిడ్డ కనిపించక పోవడంతో రేణుక పరిసరాల్లో వెతకడం ప్రారంభించారు. తిరిగొచ్చిన పరశురాం కూడా విషయం తెలుసుకుని చుట్టూ ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తే.. బాలుడిని ఓ వృద్ధుడు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. మంగళవారం రాత్రికి కూడా బాలుడి ఆచూకీ తెలియలేదని ఈస్ట్‌ పోలీసులు తెలిపారు. 

Updated Date - 2022-05-18T08:11:20+05:30 IST