తప్పిన తుఫాన్‌ ముప్పు

ABN , First Publish Date - 2021-12-05T06:06:48+05:30 IST

‘జవాద్‌’ తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారడంతో జిల్లాకు ముప్పు తప్పింది.

తప్పిన తుఫాన్‌ ముప్పు
నగరంలోని కోస్టల్‌బ్యాటరీ వద్ద అలల ఉధృతి

బలహీనపడి దిశ మార్చుకున్న ‘జవాద్‌’

ఊపిరిపీల్చుకున్న జిల్లా వాసులు

నేటి సాయంత్రం వరకూ ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీవర్షాలు

తీర ప్రాంత మండలాల్లో గాలులు

వాతావరణ నిపుణుల ప్రకటన

మరో రెండు రోజులు అప్రమత్తంగానే ఉండాలని సూచన


విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):

‘జవాద్‌’ తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారడంతో జిల్లాకు ముప్పు తప్పింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో గాలులు వీస్తాయని...అంతకు మించి పెద్దగా ప్రమాదం లేదని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో రైతులు, ప్రజలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. 


జిల్లాకు తుఫాన్‌ ముప్పు వుంటుందని మూడు రోజుల క్రితం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే అరేబియా నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తరువాత విశాఖ వైపు రాసాగింది. అయితే సముద్రంలో వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారం తెల్లవారుజాము నుంచి తుఫాన్‌ పయనం మందకొడిగా సాగింది. అదే సమయంలో బలహీనపడడమే కాకుండా దిశ మార్చుకుని ఉత్తర వాయువ్యంగా ఒడిశా వైపునకు తిరిగింది. ఈ నేపథ్యంలో విశాఖపై ప్రభావం వుండదని వాతావరణ నిపుణులు వెల్లడించారు. దీంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. శనివారం కురిసిన వర్షాలకు అక్కడక్కడా పనలు తడిసినా పెద్దగా నష్టం వుండదని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా తుఫాన్‌ ముప్పు తప్పినప్పటికీ వచ్చే రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించినందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని జిల్లా ప్రత్యేకాధికారి శ్యామలరావు తెలిపారు. తీర ప్రాంతంతోపాటు మిగిలిన ప్రభావిత మండలాల్లో ప్రత్యేకాధికారులు పర్యవేక్షిస్తున్నారని, జిల్లావ్యాప్తంగా 89 పునరావాస కేంద్రాలు చేశామన్నారు. ఎక్కడా ప్రాణనష్టం సంభవించకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. బలమైన గాలులు వీచి చెట్లు కూలితే వెంటనే తొలగించేలా రోడ్లు, భవనాల శాఖ సిద్ధంగా ఉందన్నారు. తుఫాన్‌ ముప్పు తప్పినా వచ్చే రెండు రోజుల్లో భారీవర్షాలు కురిసే అవకాశం వున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 


మరికొన్ని రైళ్లు రద్దు

తుఫాన్‌ నేపథ్యంలో ఈ నెల తొమ్మిదో తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆదివారం హౌరా-తిరుచురాపల్లి (12663), భువనేశ్వర్‌-బెంగళూరు (12845), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ (17015), పూరి-తిరుపతి (17479), పూరి-గుణుపూర్‌ (18417), భువనేశ్వర్‌-బెంగళూరు (18463), పలాస-విశాఖ (18531), కిరండోల్‌-విశాఖ (18552), పూరి-వోకా (20819), తిరుపతి-హౌరా (20890), షాలిమార్‌-త్రివేండ్రం (22642), చెన్నై-సంత్రాగచ్చి (22808), మైసూరు-హౌరా (22818), భువనేశ్వర్‌-విశాఖపట్నం (22819), విశాఖ-భువనేశ్వర్‌ (22820), పూరి-చెన్నై (22859), భువనేశ్వర్‌-తిరుపతి (22871), తిరుపతి-భువనేశ్వర్‌ (2280), గుణుపూర్‌-విశాఖపట్నం (08521), విశాఖ-గుణుపూర్‌ (08522), విశాఖ-రాయపూర్‌ (08528), రాయపూర్‌-విశాఖ (08527), కిరండోల్‌-విశాఖ (18513) రైళ్లును రద్దు చేసినట్టు ప్రకటించారు. అలాగే ఆరో తేదీన గుణుపూర్‌-పూరి (18418), జగదల్‌పూర్‌-రూర్కెలా (18108), మైసూరు-హౌరా (22818), నిజాముద్దీన్‌-విశాఖ సమతా ఎక్స్‌ప్రెస్‌ (12808), 7న బెంగళూరు-హటియా (18638), అగర్తాలా-బెంగళూరు (02984), 8న కామాఖ్య-యశ్వంత్‌పూర్‌ (12552), వోకా-పూరి (20820), 9న గౌహతి-సికింద్రాబాద్‌ (12514) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దు

Updated Date - 2021-12-05T06:06:48+05:30 IST