అదుపు తప్పిన 108
ABN , First Publish Date - 2022-05-22T06:36:30+05:30 IST
అదుపు తప్పిన ఓ 108 అంబులెన్స్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బైక్ను ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు
- క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం
- వాహనం టైరు పేలిపోవడంతో ఘటన
బుచ్చెయ్యపేట, మే 21: అదుపు తప్పిన ఓ 108 అంబులెన్స్ వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం కశింకోట- బంగారుమెట్ట (కేబీ) రోడ్డులో శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా వున్నాయి.
చినఅప్పన్నపాలేనికి చెందిన కోవెల జయమ్మ, మురళి, సకల మణికంఠ ద్విచక్రవాహనంపై శనివారం మధ్యాహ్నం కేబీరోడ్డు వడ్డాదిలో వివాహ వేడుకకు బయలుదేరారు. వీరి వాహనం బంగారుమెట్ట సమీపంలోని కల్వర్టు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వస్తున్న 108 అంబులెన్స్ టైరు ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో వాహనం అదుపు తప్పి, ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో జయమ్మ, మణికంఠల పరిస్థితి విషమంగా ఉండడంతో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడి నుంచి విశాఖకు పంపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని, వివరాల సేకరణకు ప్రయత్నిస్తున్నామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.